|
రూ.3 కోట్ల నజరానాను అందుకున్న ద్యుతీ చంద్
1998 బ్యాంకాక్ క్రీడల్లో జ్యోతిర్మయి సిక్దార్ 800 మీటర్లు, 1500 మీటర్లలో రెండు పతకాలు సాధించింది. 2002 బుసాన్ క్రీడల్లో సునితా రాణి 1500 మీటర్లు, 500 మీటర్లలో రెండు పతకాలతో మెరిసింది. ఇప్పుడు వారి సరసర ద్యుతీ చంద్ చేరింది. ఈ నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ద్యుతీ చంద్కు రూ.3 కోట్ల నజరానాను ప్రకటించారు.
తన ఇంటిని బాగుచేసుకుంటానని చెప్పిన ద్యుతీ చంద్
ఆసియా గేమ్స్ నుంచి స్వదేశానికి చేరిన ద్యుతి చంద్కు రూ. 3 కోట్ల నజరానా బహుకరించారు. ఈ ప్రైజ్ మనీతో ముందుగా తన ఇంటిని బాగుచేసుకోనున్నట్లు ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో ద్యుతీ చంద్ వెల్లడించింది. అనంతరం ద్యుతీ చంద్ మాట్లాడుతూ "ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. చాలా సంతోషంగా ఉంది" అని పేర్కొంది.
పురుష హార్మోన్లు అధికంగా ఉన్నాయంటూ
"పురుష హార్మోన్లు అధికంగా ఉన్నాయంటూ 2014 గ్లాస్గోలో నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్లో నన్ను పాల్గొననివ్వలేదు. ఇప్పుడేమో అర్హత మార్కు అందుకోలేక బరిలోకి దిగలేకపోయా. నా కోచ్ రమేశ్ సర్ నాతో ఆసియా గేమ్స్కు సిద్ధం అవ్వు. తప్పకుండా పతకాలు సాధిస్తావ్ అన్నారు. మొదట నమ్మలేదు. కానీ ఆ తర్వాత బాగా కష్టపడ్డా" అని తెలిపింది.
ఆరు సార్లు ట్రైనింగ్ సెషన్లో పాల్గొనేదాన్ని
"ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రమం తప్పకుండా ఆరు సార్లు ట్రైనింగ్ సెషన్లో పాల్గొనేదాన్ని. సుమారు నాలుగు నెలల పాటు నా దిన చర్య ఇదే. నేను ఇన్నాళ్లు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుకున్నా. చాలా సంతోషంగా ఉంది" అని ద్యుతీ చంద్ తెలిపింది.
అది నన్నెంతో ఆవేదనకు గురి చేసింది
"నా శరీరంలో పురుష హార్మోన్లు అధికంగా ఉన్నాయని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వేటు వేయడం నన్నెంతో ఆవేదనకు గురి చేసింది. దీంతో నన్ను భారత జట్టు నుంచి తప్పించారు. అంతేకాదు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నన్ను హాస్టల్లోకి అనుమతించలేదు. ఇదంతా చూసి ఎంతో కుంగిపోయాను. ఆ తర్వాత ధైర్యంగా పోరాడాను. ఆర్బిట్రేషన్ కోర్టులో కేసు వేసి గెలిచాను" అని పేర్కొంది.
పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందా
"ఆ తర్వాత, హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందాను. ఆసియా గేమ్స్కు అర్హత సాధించాను. ఇప్పుడు రెండు పతకాలు గెలిచాను. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేను పతకాలు గెలిచినందుకుగాను ప్రైజ్ మనీ ప్రకటించారు. ముందుగా ఈ డబ్బుతో నా ఇంటిని బాగుచేసుకుంటాను. త్వరలో టోక్యో ఒలింపిక్స్ కోసం ట్రైనింగ్ మొదలుపెడతాను. ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించడమే నా లక్ష్యం" అని ద్యుతీ చంద్ తెలిపింది.