Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు బిగ్ షాక్ తగిలింది. మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ చేరిన వినేష్ ఫొగట్పై అనర్హత వేటు పడింది. ఇంకాసేపట్లో ఫైనల్స్లో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్ను ఢీ కొట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె డిస్ క్వాలిఫై అయ్యారు.
ఫైనల్స్ ఆడటానికి కొద్దిసేపటి ముందు షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. వినేష్ ఫొగట్ డిస్క్వాలిఫై అయ్యారని భారత ఒలింపిక్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది కూడా. ఓవర్ వెయిట్ అంటే.. అధిక బరువు కారణంగా వినేష్ ఫొగట్పై అనర్హత వేటు పడింది. నిర్దేశిత బరువు కంటే కొన్ని గ్రాములు అధికంగా ఉండటం అనర్హత వేటుకు కారణమైంది.

మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఆమె పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇందులోనే ఆమె ఫైనల్స్లో అడుగుపెట్టగలిగారు. పతకాన్ని ఖాయం చేసుకోగలిగారు. ఫైనల్స్ ఓడినా వెండి పతకం మాత్రం ఖాయం. ఈ పరిస్థితుల్లో అధిక బరువు కారణంగా ఆమె అనర్హత వేటుకు గుర్యారు.
ఈ కేటగిరిలో ఆడే రెజ్లర్ 50 కేజీలు, లేదా అంతకంటే తక్కువ శరీర బరువును కలిగి ఉండాలి. నిబంధనల మేరకు ఓ 100 గ్రాముల వరకు అధిక బరువును కలిగి ఉండొచ్చు. వినేష్ ఫొగట్ మాత్రం 50 కేజీలకు మించి బరువును కలిగి ఉన్నారని, అదే అనర్హత వేటుకు కారణమైందని ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది.
మంగళవారం రాత్రి ఆమె రెండు కేజీల వరకు బరువు పెరిగినట్లు సమాచారం. మొత్తంగా 52 కేజీల బరువును కలిగి ఉన్నారని చెబుతున్నారు. దీన్ని 50 కేజీల లోపు వరకు తగ్గించుకోవడానికి మంగళవారం రాత్రంతా నిద్రాహారాలు సైతం మానివేశారని తెలుస్తోంది. అయినప్పటికీ బరువు తగ్గకపోవడం వల్ల ఫైనల్స్ ఆడకుండా అనర్హత వేటు వేయొచ్చని సమాచారం.

ఈ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీకి చెందిన కైసర్ గంజ్ లోక్సభ సభ్యుడు, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ కుమారుడు కరణ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. దేశానికి ఇది తీరని నష్టంగా అభివర్ణించారు. ఫెడరేషన్ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని, ఇందులో ఏమి చేయగలదో చూస్తుందని అన్నారు.