
న్యూఢిల్లీ: బర్మింగ్హమ్-2022 కామన్వెల్త్ గేమ్స్ను బహిష్కరిస్తామని హెచ్చరించిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వెనక్కి తగ్గింది. బాయ్కాట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తదుపరి క్రీడల నిర్వహణకు బిడ్ వేయాలని నిర్ణయించుకుంది. బర్మింగ్హమ్ గేమ్స్లో భారత బృందం పాల్గొంటుందని సోమవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐఓఏ ఓ ప్రకటన చేసింది.
కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు అత్యధిక పతకాలు సాధించి పెట్టే షూటింగ్ను బర్మింగ్హామ్ పోటీల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఐవోఏ.. ఒకానొక సమయంలో క్రీడల నుంచి తప్పుకోవాలని అనుకుంది. అయితే వార్షిక సమావేశం అనంతరం బాయ్కాట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఐఓఏ పేర్కొంది. 2026 లేక 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు బిడ్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఐవోఏ చీఫ్ నరీందర్ బాత్రా తెలిపారు.
'కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కోసం బిడ్ వేయాలని నిర్ణయించాం. సుదీర్ఘంగా చర్చించాక ఈ తీర్మానం చేశాం. 2026 లేక 2030 టోర్నీ కోసం బిడ్ వేస్తాం'అని బాత్రా తెలిపారు. 2026 కామన్వెల్త్ గేమ్స్ వేదికను వచ్చే ఏడాది ప్రకటిస్తారు. 2022 కామన్వెల్త్ గేమ్స్లో చోటు దక్కని ఆర్చరీ క్రీడాంశంలోనూ ప్రత్యేకంగా కామన్వెల్త్ చాంపియన్షిప్ను నిర్వహించాలనే ప్రతిపాదనను సీజీఎఫ్కు పంపిస్తామన్నారు. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్కు ఇప్పటివరకు భారత్ నుంచి 60 మంది క్రీడాకారులు అర్హత సాధించారు. ఈ సంఖ్య 125 లేదా 150కు చేరుకునే అవకాశం ఉంది. టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల నుంచి కనీసం 10 పతకాలు సాధిస్తారు అని బాత్రా ధీమా వ్యక్తం చేశారు.
'2022 కామన్వెల్త్ గేమ్స్ను భారత్ బహిష్కరించకూడదని ఏజీఎంలో నిర్ణయం తీసుకున్నాం. 2026 లేదా 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్యం కోసం భారత్ బిడ్ దాఖలు చేయాలని ఏజీఎంలో తీర్మానించాం. కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నాక అధికారికంగా బిడ్ దాఖలు చేస్తాం' అని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా పేర్కొన్నారు. మరోవైపు ఐవోఏ నిర్ణయాన్ని కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య స్వాగతించింది.