టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు బజ్రంగ్ పునియా, రవి దహియాలకు బిగ్ షాక్ తగిలింది. సెలక్షన్ ట్రయల్స్లో అనూహ్యంగా ఓటమిపాలై పారిస్ ఒలింపిక్స్ అర్హత రేసు నుంచి ఈ స్టార్ రెజ్లర్లు నిష్క్రమించారు. ఆసియా, ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో పోటీపడే అవకాశం కోసం సెలక్షన్ ట్రయల్స్ను ఆదివారం నిర్వహించారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో సాగిన ఈ పోటీలో 65 కిలోల విభాగంలో బజ్రంగ్, 57 కేజీలో విభాగంలో రవి దహియా పరాజయాన్ని చవిచూశారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్ల చేసిన నిరసనలో బజ్రంగ్ పునియా కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఐవోఏ అడ్హక్ ప్యానెల్ నిర్వహించిన ఈ ట్రయిల్స్ కోసం బజ్రంగ్ రష్యాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. కానీ సెమీఫైనల్లో రోహిత్ కుమార్ చేతిలో 1-9తో చిత్తుగా ఓడిపోయాడు. అంతకుముందు తొలి రౌండ్లో రవీందర్పై స్వల్ప తేడాతో విజయం సాధించి బయటపడ్డాడు.

ఓటమి అనంతరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయాడు. డోపింగ్ టెస్టు కోసం నాడా అధికారులకు శాంపిల్స్ కూడా ఇవ్వలేదు. అంతకుముందు సస్పెండ్ అయిన డబ్ల్యూఎఫ్ఐకు ట్రయిల్స్ నిర్వహించే అధికారం లేదని బజ్రంగ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. న్యాయస్థానంలో సానుకూల ఫలితాన్ని రాబట్టుకుని కూడా బజ్రంగ్ ఓటమిపాలవ్వడం గమనార్హం.
మరోవైపు రవి దహియా ప్రారంభ రౌండ్లోనే అమన్ షెహ్రావత్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత బౌట్లో కూడా ఉదిత్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. దీంతో రేసు నుంచి దహియా నిష్క్రమించాడు.కాగా, ఈ ట్రయల్స్ విజేతలకు వచ్చేనెలలో బిషెక్లో జరిగే ఆసియా క్వాలిఫయర్స్, ఇస్తాంబుల్ వేదికగా మేలో జరిగే వరల్డ్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
ఆసియా క్వాలిఫయర్స్కు ఎంపికైన భారత జట్టు: అమన్ షెహ్రావత్ (57 కేజీ), సుజీత్ కల్కల్ (65 కేజీ), జైదీప్ (75 కేజీ), దీపక్ పునియా (86 కేజీ), దీపక్ నెహ్రా (97 కేజీ), సుమిత్ మాలిక్ (125 కేజీ).