వినేష్ ఫొగట్. ఈ పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల కేసులో రోజుల తరబడి ఢిల్లీ నడిరోడ్ల మీద ఆందోళన చేసిన భారత మహిళా రెజ్లర్. మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారని, ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ రోడ్డెక్కిన రెజ్లర్లల్లో ఆమె ఒకరు. రోజుల తరబడి నిరసనలు కొనసాగించారు.
బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్వీర్ రాఠీ, జితేందర్ కిన్హాతో కలిసి జంతర్ మంతర్ వద్దే ఫుట్పాత్పై నిద్రించిన రోజులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ పోడియం నుంచి ఫుట్పాత్ వరకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ద్వారా ఎన్నో అవమానాలు, వేధింపులను ఎదుర్కొన్నామని, తమను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ మీడియా ఎదురుగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు అనేకం.

అలాంటి వినేష్ ఫొగట్.. పారిస్ ఒలింపిక్స్ 2024లో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. పతకాన్ని ఖాయం చేసుకున్నారు. బంగారంపై కన్నేశారు. గోల్డ్ మెడల్ కోసం నేడు ఫైనల్స్లో తలపడబోతున్నారు. అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్ను ఢీ కొట్టబోతోన్నారు.
ఫైనల్స్ ఆడటానికి కొద్దిసేపటి ముందు షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆమె అనర్హతకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. వినేష్ ఫొగట్ డిస్క్వాలిఫై అయ్యారనే ప్రచారం మీడియాలో ముమ్మరంగా సాగుతోంది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందనే విషయం ఇంకా తెలియరావట్లేదు.
ఓవర్ వెయిట్ అంటే.. అధిక బరువు కారణంగా వినేష్ ఫొగట్పై అనర్హత వేటు పడిందని చెబుతున్నారు. మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఆమె పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇందులోనే ఆమె ఫైనల్స్లో అడుగుపెట్టగలిగారు. పతకాన్ని ఖాయం చేసుకోగలిగారు. ఫైనల్స్ ఓడినా వెండి పతకం మాత్రం ఖాయం.
ఈ పరిస్థితుల్లో అధిక బరువు కారణంగా ఆమెపై వేటు పడిందనే ప్రచారం జరుగుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేటగిరిలో ఆడే రెజ్లర్ 50 కేజీలు, లేదా అంతకంటే తక్కువ శరీర బరువును కలిగి ఉండాలి. నిబంధనల మేరకు ఓ 100 గ్రాముల వరకు అధిక బరువును కలిగి ఉండొచ్చు.
వినేష్ ఫొగట్ మాత్రం 50 కేజీలకు మించి బరువును కలిగి ఉన్నారని, అదే అనర్హత వేటుకు కారణమైందని అంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె రెండు కేజీల బరువు పెరిగినట్లు సమాచారం. మొత్తంగా 52 కేజీల బరువును కలిగి ఉన్నారని చెబుతున్నారు. దీన్ని 50 కేజీల లోపు వరకు తగ్గించుకోవడానికి మంగళవారం రాత్రంతా నిద్రాహారాలు సైతం మానివేశారని తెలుస్తోంది. అయినప్పటికీ బరువు తగ్గకపోవడం వల్ల ఫైనల్స్ ఆడకుండా అనర్హత వేటు వేయొచ్చని సమాచారం.
దీనిపై భారత ఒలింపిక్స్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని ధృవీకరించింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల కేటగిరీ నుంచి వినేష్ ఫోగట్ అనర్హతకు గురయ్యారని తెలిపింది. ఈ ఉదయం 50 కిలోల కంటే కొన్ని గ్రాముల బరువు అధికంగా ఉన్నట్లు నిర్ధారించింది.