
టోక్యో: భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్ 2020లో భావినాబెన్ సెమీస్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె భారత్కు ఓ పతాకాన్ని ఖాయం చేసింది. ఇక స్వర్ణ పతకానికి రెండడుగుల దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో సెర్బియాకు చెందిన బోరిస్లావా పెరిక్ రాంకోవిచ్ని భావినాబెన్ 3-0తో ఓడించింది. ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన రాంకోవిక్ను భారత క్రీడాకారిణి 18 నిమిషాల్లోనే 11-5, 11-6, 11-7 వరుస సెట్లలో ఓడించింది.
భావినాబెన్ పటేల్ సెమీస్లోకి దూసుకెళ్లడంతో భారత్కు తొలి పతకం ఖాయం అయింది. టేబుల్టెన్నిస్ మహిళల సింగిల్స్ క్లాస్-4 విభాగంలో సెమీ ఫైనల్లో అడుగు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్గా రికార్డులకెక్కింది. భావినాబెన్ తన తర్వాతి పోరులో చైనాకు చెందిన మియావో ఝాంగ్తో తలపడనుంది. శనివారం ఉదయం 6:10 గంటలకు సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ మియావోను ఓడిస్తే భావినాబెన్ ఫైనల్ చేరుకుంటుంది. అంతేకాదు టోక్యో పారాలింపిక్స్ 2020లో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా కూడా నిలవనుంది.
అంతకుముందు బ్రెజిల్కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్లో 3-0తో తిరుగులేని విజయం సాధించిన భావినాబెన్ పటేల్ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఫలితంగా పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి ఇండియన్గా రికార్డు సృష్టించింది. రౌండ్ ఆఫ్ 16లో ఒలివీరాను 12-10 13-11, 11-6తో ఓడించేందుకు భావినాబెన్కు 23 నిమిషాల సమయం పట్టింది. క్వార్టర్ ఫైనల్కు ముందు గ్రేట్ బ్రిటన్ అమ్మాయి మేగన్ షక్లెటన్తో జరిగిన మ్యాచులో 3-1 తేడాతో భావినాబెన్ ఘన విజయం సాధించింది. 41 నిమిషాల పాటు జరిగిన హోరాహోరిగా జరిగిన ఈ పోరులో 11-7, 9-11, 17-15, 13-11 తేడాతో షక్లెటన్ను ఓడించింది.
మ్యాచ్ అనంతరం భావినాబెన్ పటేల్ మాట్లాడుతూ.... 'సెమీస్ మ్యాచుల్లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఈ రోజు నేను చాలా ఓపికగా ఆడాను. బంతిపైనే ఏకాగ్రత నిలిపాను. బోరిస్లావా పెరిక్ రాంకోవిచ్ చాలా మంచి ప్లేయర్. అందుకే ప్రతికూల ఆలోచనలతో మ్యాచు వదులుకూడదని నిర్ణయించుకున్నా. కఠిన మ్యాచులో గెలిచినందుకు సంతోషంగా ఉంది. పథకానికి అడుగు దూరంలో ఉన్నాను. కచ్చితంగా మెడల్ సాధిస్తా. మెడల్ సాధించడం కోసమే టోక్యో నగరానికి వచ్చాను. అందుకోసం నా ప్రయత్నం చేస్తాను' అని చెప్పింది.
భావినాబెన్ పటేల్ విజయంపై భారత స్టార్ రెజ్లర్ రవికుమార్ దహియా స్పందించాడు. కమాన్ ఇండియా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రోత్సహించాడు. 'కమాన్ ఇండియా. ప్రపంచ నంబర్ 2, బోరిస్లావా రాంకోవిచ్పై భావినాబెన్ పటేల్ అద్భుతమైన విజయం సాధించింది. టోక్యో పారాలింపిక్ గేమ్స్లో భారత్కు పతకం ఖాయం అయింది. శబాష్ భావినాబెన్' అంటూ రవికుమార్ దహియా ట్వీట్ చేశాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణ ఆశలు రేకెత్తించిన రవికుమార్ దహియా కీలక ఫైనల్లో తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. పురుషుల 57 కేజీల ఫ్రీ స్టైల్ ఫైనల్లో నాలుగో సీడ్ దహియా 4-7 తేడాతో రష్యా ఒలింపిక్స్ కమిటీ అథ్లెట్ జవర్ ఉగువే చేతిలో ఓటమిపాలయ్యాడు. దాంతో రవి దహియాకు రజత పతకం వరిచింది.