భారత స్టార్ రెజ్లర్లు భజ్రంగ్ పూనియా, వినేష్ ఫోగట్ ఇద్దరూ కూడా ఆసియా క్రీడల్లో భారత్కు కీలక కానున్నారు. వీళ్లిద్దరూ కూడా ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడలకు వెళ్లనున్నారు. భారత్ తరఫున భజరంగ్ పూనియా 65 కిలోల విభాగంలో, వినేష్ ఫొగట్ 53 కిలోల విభాగంలో పోటీ పడనున్నారు. అయితే వీరిద్దరికీ ట్రయల్స్ నిర్వహించకుండానే ఆసియా క్రీడలకు పంపాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) డిసైడ్ చేసింది.
ఈ విషయం వీళ్ల కోచ్లకు కూడా తెలియదట. అయితే ఇలా వీళ్లిద్దరినీ ట్రయల్స్ లేకుండా ఎంపిక చేయడంపై మిగతా రెజ్లర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇతర రెజ్లర్లు, వారి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఫ్రీస్టైల్ పురుషుల 65 కిలోలు, మహిళల 53 కిలోల కేటగిరీ రెజ్లర్లను ఈపాటికే ఎంపిక చేయగా.. మిగతా ఆరు కేటగిరీల కోసం శని, ఆదివారాల్లో ట్రయల్స్ నిర్వహించనున్నట్టు అడ్హక్ ప్యానెల్ ప్రకటించింది.

ఈ ప్రకటనలో భజ్రంగ్, వినేష్కు మినహాయింపు ఇస్తున్నట్టు ఎక్కడా పేర్కొనలేదు. కానీ వారిద్దరికీ బెర్త్లు మాత్రం ఖరారైనట్టు ప్యానెల్ సభ్యుడు అశోక్ గార్గ్ స్పష్టం చేశారు. ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే.. నిబంధనల ప్రకారం ఒలింపిక్, వరల్డ్ చాంపియన్షిప్లో పతకాలు సాధించిన ప్లేయర్లకు ఇలా ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ అలా చేయాలంటే ఆయా ప్లేయర్ల పేర్లను కోచ్లు సిఫారసు చేయాలి.
అయితే భజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ ఇద్దరూ కూడా డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నిరసనలు చేసిన ఈ ఇద్దరూ.. కొన్ని నెలలుగా ఏ టోర్నీలోనూ పాల్గొనలేదు. అలాంటి వారిని నేరుగా ఆసియా క్రీడలకు ఎలా ఎంపిక చేస్తారని ఇతర రెజ్లర్లు, వారి కుటుంబాలు నిలదీస్తున్నాయి. మరి దీనికి డబ్ల్యూఎఫ్ఐ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.