
కోల్కతా: అసలే టాలీవుడ్.. బాలీవుడ్లలో ప్రస్తుతం ఉర్రూతలూగిస్తున్న ట్రెండ్ బయోపిక్.. ఇవి ఎంతలా ఉంటున్నాయంటే దాదాపు గతకాలపు ఛాంపియన్స్ పాత్రలో ఈ తరం హీరోలు ఒదిగిపోతున్నారు. అది సినిమా వరకూ అయితే పర్లేదు. కానీ, నిజ జీవితంలోనూ వాళ్లనే ఛాంపియన్లు అనుకోవడం పొరబాటే. సరిగ్గా ఇలాంటి పనే చేశారు పశ్చిమ్బంగా విద్యాశాఖ, ప్రచురణ కర్తలు. వాళ్లు చేసిన తప్పిదం మమత ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేసింది.
పాఠశాల పుస్తకాల్లో పరుగుల వీరుడు మిల్కాసింగ్ స్థానంలో బాలీవుడ్ నటుడు పర్హాన్ అక్తర్ ఫొటో రావడమే ఇందుకు కారణం. ఈ గందరగోళానికి కారణం హిందీ సినిమా 'భాగ్ మిల్కా భాగ్'. అది మిల్కాసింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. దానిలో మిల్కాసింగ్గా పర్హాన్ అక్తర్ నటించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే అక్కడ జరిగిన పొరపాటు ఫర్హాన్ ఫొటో రావడానికి కారణమైంది. దీన్ని గుర్తించిన ఒకరు ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
'పశ్చిమ్ బంగా పాఠ్య పుస్తకంలో మిల్కాసింగ్ స్థానంలో ఫర్హాన్ ఫొటో ప్రచురించారు. ఇదేమీ ఆశ్చర్యం కలిగించడంలేదు. ఎందుకంటే ఇది ఇక్కడ సర్వసాధారణం' అని అతడు ట్విటర్ సాక్షిగా ప్రభుత్వ చర్యను ఎద్దేవా చేశాడు. దీనిపై నటుడు ఫర్హాన్ అక్తర్ కూడా స్పందించారు.