హైదరాబాద్: మ్యాచ్ ఓడిపోయారని జట్టు మొత్తానికి గుండు గీయించాడు ఓ కోచ్. ఈ దారుణ సంఘటన కోల్కతాలో చోటు చేసుకుంది. అండర్-19 ఆటగాళ్లకు ఆ జట్టు కోచ్ ఆనంద్ కుమార్ విధించిన గుండు శిక్షపై బెంగాల్ హాకీ సంఘం (బీహెచ్ఏ) విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనపై సోమవారం త్రిసభ్య విచారణ కమిటీని నియమించినట్లు బీహెచ్ఏ కార్యదర్శి స్వపన్ బెనర్జీ తెలిపారు.
ఐసీసీ అవార్డులు: చరిత్ర సృష్టించిన కోహ్లీ, ఎమర్జింగ్ ప్లేయర్గా పంత్
అసలేం జరిగింది?
జాతీయ జూనియర్ బి-డివిజన్ టోర్నీలో భాగంగా జబల్పూర్లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బెంగాల్ అండర్-19 జట్టు నాంధారి ఎలెవన్ చేతిలో 1-5 గోల్స్తో ఓడిపోయింది. దీంతో బెంగాల్ జట్టు కోచ్ ఆనంద్ కుమార్ ఆగ్రహం తారస్థాయికి చేరింది. దీంతో ఆయన ఆటగాళ్లను గుండు చేసుకోమన్నట్లు ఆరోపణలొచ్చాయి.
కోచ్ ఆదేశాలతో జట్టులోని 18 మందిలో 16 మంది గుండు చేయించుకున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బీహెచ్ఏ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. కోచ్ ఆనంద్ మాత్రం గుండు చేయించుకోమని చెప్పలేదని అన్నారు.
"మ్యాచ్ సమయంలో నేను వారిపై కేకలు వేశాను. అంతేగానీ ఓడిపోతే గుండు చేసుకోవాలని ఆదేశించలేదు. నేను ముందు ఆటగాళ్లతో మాట్లాడతా. నా భార్య ఆసుపత్రిలో ఉండటంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం నాకు లేకుండా పోయింది" అని కోచ్ వివరణ ఇచ్చారు.