ఢాకా: భారత బౌలర్లు బాగా రాణించడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ పై భారత్ పేసర్లు ఆది నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మహ్మదుల్లా(96 నాటౌట్ ) ఒంటరి పోరాటానికి తోడు అష్రాఫుల్ (39) అల్ హసన్ (34), రహీమ్ (30) ఇన్నింగ్స్ తోడవడంతో బంగ్లా ఆమాత్రమైన స్కోరు చేయగలిగింది. బంగ్లా ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ , కైస్ డకౌట్ గా వెనుదిరిగారు. భారత బౌలర్లలో జహీర్ కు 3 వికెట్లు లభించగా, ఇషాంత్ 4 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఓజాకు 2 వికెట్లు లభించగా భజ్జీకి కేవలం ఒక్క వికెట్ తో సంతృప్తి చెందాల్సి వచ్చింది.