ప్రపంచ స్థాయి రెజ్లింగ్లో భారత్కు పలు పతకాలు అందించిన రెజ్లర్లు ప్రస్తుతం కష్టాలు పడుతున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు. గత 33 రోజులుగా ఈ నిరసన కొనసాగుతూనే ఉంది. అయినా సరే వారి డిమాండ్లు తీరలేదు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ప్రముఖ రెజ్లర్ భజరంగ్ పూనియా ఆవేదన వ్యక్తం చేశాడు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్పై పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు లైంగిక వేధింపులు, మెంటల్ టార్చర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతన్ని అరెస్టు చేయాలంటూ 33 రోజులుగా వాళ్లు నిరసన చేస్తున్నారు. ఈ ఆరోపణలను బ్రిజ్ భూషణ్ తీవ్రంగా ఖండించారు.

ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాట్లాడిన పూనియా.. 'ఇలా నిరసన చేయడం వల్ల మా కెరీర్లు ముగిసిపోతాయని మాకు తెలుసు. రిటైర్ అయిన తర్వాత కోచింగ్, అడ్మినిస్ట్రేషన్ వంటి ఆప్షన్స్ మాకు ఉండవని కూడా తెలుసు. మా మీద తప్పుడు కేసులు పెడతారని కూడా అనుకున్నాం. కానీ నిజం మా వైపు ఉన్నప్పుడు పోరాడటమే మంచిదని నిర్ణయించుకున్నాం' అని చెప్పాడు.
'పట్టుదలతో పోరాడితే భయపడాల్సిన అవసరం ఉండదు అనుకున్నాం. ఇది అంత సులభంగా తీసుకున్న నిర్ణయం కాదు. కానీ ఒకసారి డిసైడ్ అయిన తర్వాత అయితే, గియితే అనే ఆలోచనలు చేయదలచుకోలేదు' అని చెప్పుకొచ్చాడు. తాము అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లం కాబట్టి, తమ గోడు ఎవరో ఒకరు వింటారని అనుకున్నట్లు చెప్పాడు. కానీ ఒకసారి నిరసనకు వచ్చిన తర్వాత తమకు రియాలిటీ చెక్ జరిగిందని బాధ పడ్డాడు.
'ఇంతకాలం ఈ నిరసన కొనసాగుతుందని నేను అస్సలు అనుకోలేదు. మేం అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులం. కాబట్టి ప్రభుత్వం మా మాట వింటుందని అనుకున్నాం. ఆ ధైర్యంతోనే కెరీర్లు రిస్క్ చేశాం. కానీ ఇలా మమ్మల్ని గాలికి వదిలేయడం చాలా బాధగా ఉంది. అయితే మేం రెజ్లర్లం.. పోరాడకుండా ఓడిపోవడం జరగదు. ఈ దేశంలో పేదలకు ఒక చట్టం, సింగ్ వంటి పవర్ఫుల్ వారికి ఒక చట్టం ఉంటుందని నాకు తెలిసొచ్చింది' అని చెప్పాడు.