
హైదరాబాద్: కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 'ఫిట్నెస్ ఛాలెంజ్' అంటూ ఓ ఛాలెంజ్ను మొదలుపెట్టాడో తెలియదు గానీ, ఆ తర్వాత 'గ్రీన్ ఛాలెంజ్', 'కికి ఛాలెంజ్' అంటూ సోషల్ మీడియాలో ఛాలెంజ్ల మోత మోరుమ్రోగిపోతుంది. తాజాగా #36SecPlankChallenge సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.
ప్రముఖ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ బజాజ్ అలియాజ్ గ్రూప్ ఈ కొత్త ఛాలెంజ్కు శ్రీకారం చుట్టింది. అంతేకాదు ఈ ఛాలెంజ్ స్వీకరించి, వీడియోలు పోస్ట్ చేస్తే గుండె జబ్బుల బాధపడే చిన్నారులకు ఆర్థిక సాయం చేసిన వారవుతారని సందేశాన్ని సైతం జోడించింది. దీంతో ఈ ఛాలెంజ్ స్వీకరించేందుకు చాలామంది సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు.
ఈ ఛాలెంజ్లో 36 సెకన్ల పాటు శరీర బరువును మోచేతులపై, అరికాళ్లపై మోస్తూ పడుకోవాల్సి ఉంటుంది. మోచేతులు, అరికాళ్లు తప్ప శరీరం నేలను తాకకూడదు. ఈ ఛాలెంజ్ పూర్తిచేసి బాడీ ఫిట్నెస్ను కూడా నిరూపించుకోవచ్చని ఛాలెంజ్కు శ్రీకారం చుట్టిన బజాజ్ అలియాజ్ గ్రూప్ నిర్వాహకులు చెబుతున్నారు.
తాజాగా ఈ ఛాలెంజ్ను భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్వీకరించింది. తన ఇంట్లోనే ఈ ఛాలెంజ్ను స్వీకరించిన సైనా నెహ్వాల్ ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్లో పోస్టు చేస్తూ... బ్యాడ్మింటన్ ప్లేయర్లు పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్లతో పాటు కేంద్రమంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్లకు సవాల్ విసిరింది.
కాగా, భారత జిమ్నాస్టిక్ క్రీడాకారిణి అక్షత కూడా ఈ ఛాలెంజ్ను స్వీకరించింది. "ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. ప్రతీరోజు సరిహద్దులను చెరిపివేసేందుకు మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. సైనా నెహ్వాల్, బజాజ్ అలియాజ్ ఆలోచన అద్భుతం" అంటూ ట్వీట్ చేసింది.
కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత గీతా ఫోగట్ కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించింది. తన వీడియోని ట్విట్టర్లో పోస్టు చేసి భాలీవుడ్ నటి పాపీ జబ్బల్, మోనిక డోగ్రాలతో పాటు కబడ్డీ ప్లేయర్ అనూప్ కుమార్లను ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా సవాల్ విసిరింది.