
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ చీఫ్ కోచ్గా 25 ఏళ్ల పాటు సేవలందించిన బహదూర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. 74 ఏళ్ల సింగ్ కాంట్రాక్ట్ గత నెల 30తో ముగిసింది. నిజం చెప్పాలంటే.. ప్రధాన కోచ్గా సేవలు అందించిన బహదూర్ తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. వయసు నిబంధనల కారణంగా భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) అతడితో ఒప్పందాన్ని కొనసాగించేందుకు నిరాకరించింది.
1978, 1982 ఆసియా క్రీడల షాట్పుట్లో స్వర్ణం సాధించిన బహదూర్ సింగ్.. 1995 ఫిబ్రవరిలో కోచ్గా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ కాలం ప్రధాన కోచ్గా సేవలు అందించిన వారిలో అతడు ముందుంటారు. ప్రస్తుతం అతడి వయస్సు 74 ఏళ్లు. 70 ఏళ్లకు మించిన వారిని కోచ్లుగా ఉంచరాదని క్రీడల శాఖ మార్గనిర్దేశకాల జారీ చేసిన నేపథ్యంలో అతడిని ప్రధాన కోచ్గా కొనసాగించకూడదని సాయ్ నిర్ణయించింది.
'బహదూర్ సింగ్ చేసిన సహకారాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం. 70 మరియు 80ల ప్రారంభంలో ప్రఖ్యాత షాట్ పుటర్గా, తరువాత చీఫ్ కోచ్గా ఏంతో సేవ చేసారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడలలో జట్టుకు కోచ్గా ఉంటాడనుకున్నాం. కానీ ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహా నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు' అని ఏఎఫ్ఐ ప్రెసిడెంట్ అడిల్లె జె. సుమరివాల్లా ఒక ప్రకటనలో తెలిపారు.
అథ్లెట్గా 1978, 1982 ఆసియా క్రీడల షాట్పుట్ ఈవెంట్లో స్వర్ణాలు సాధించిన బహదూర్ సింగ్.. 1980 మాస్కో ఒలింపిక్స్లో పాల్గొన్నారు. 1976లో అర్జున అవార్డు, 1998లో ద్రోణాచార్య అవార్డులను ఆయన అందుకున్నారు. కోచ్గా బహదూర్ హయాంలో భారత జట్టు ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు సహా 12 పతకాలను సొంతం చేసుకుంది. 2018 జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్లో 8 స్వర్ణాలు, 9 రజతాలు సహా 20 పతకాలతో అదరగొట్టింది.