న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి లోకసభకు పోటీ చేసే కాంగ్రెసు అభ్యర్థుల జాబితా దాదాపుగా బయట పడింది. అయితే, ఆ జాబితాలో మాజీ క్రికెటర్ మొహ్మద్ అజరుద్దీన్ పేరు లేదు. దీంతో అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడికి టికెట్ నిరాకరిస్తే పరిస్థితి వ్యతిరేకంగా మారవచ్చుననే ఉద్దేశంతో అజరుద్దీన్ కు టికెట్ నిరాకరించినట్లు చెబుతున్నారు. అయితే, అజర్ కు ప్రత్యామ్నాయం చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అజరుద్దీన్ వచ్చే ఎన్నికల్లో పోటీకి దించే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. అజరుద్దీన్ ను దేశంలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి దించవచ్చననేది పార్టీ నాయకత్వం ఆలోచన అని అంటున్నారు. స్థానిక గుర్తింపు అనే అజర్ లాంటి వ్యక్తికి ప్రధానం కాదని వాదిస్తున్నారు. అజర్ ను రాజస్థాన్ నుంచి పోటీకి దించడానికి రెండు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉందని చెబుతున్నారు. రాజస్థాన్ అభ్యర్థుల ఎంపికపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెలాఖరున కసరత్తు చేస్తుంది.