టోక్యో: ఒలింపిక్ గేమ్స్ను ఓ వైపు కరోనా కమ్మేస్తుంటే.. మరో వైపు డ్రగ్స్ భూతం కలకలం రేపుతోంది. ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి కేవలం ఒకరోజు మాత్రమే సమయం మిగిలి ఉండగా మరో స్కాండల్ ఈ గేమ్స్ పై పంజా విసిరింది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఈక్వెస్ట్రియాన్ అథ్లెట్ జేమీ కర్మాండ్ను గేమ్స్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.
ఒలింపిక్స్లో డ్రగ్స్ కలకలం.. సాధారణంగా ఒలింపిక్స్లాంటి మెగా గేమ్స్లో పాల్గొనే క్రీడాకారులకు అందరికీ డోప్ టెస్టులు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఎవరైనా నిషిద్ధ స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు తేలితే వారిని సస్పెండ్ చేస్తారు. కొన్ని సార్లు కొన్నేళ్ల పాటు వారిపై నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఈక్వెస్ట్రియన్ అథ్లెట్ జేమీ కర్మాండ్ డోప్ టెస్టులో కొకైన్ తీసుకున్నట్లుగా తేలింది. దీంతో ఆస్ట్రేలియా నేషనల్ యాంటీ డోపింగ్ పాలిసీ 2021 ప్రకారం జేమీ కర్మాండ్ను గేమ్స్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆస్ట్రేలియా ఈక్వెస్ట్రియాన్ తెలిపింది.
స్పోర్ట్స్ ఇంటెగ్రిటీ ఆస్ట్రేలియా 26 జూన్ 2021న నిర్వహించిన డోపింగ్ టెస్టులో కర్మాండ్ కొకైన్ తీసుకున్నట్లు తేలిందని.. టెస్టులో పాజిటివ్ వచ్చిందని ఆస్ట్రేలియా పేర్కొంది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) ప్రకారం కొకైన్ నిషేధం విధించబడని స్టెరాయిడ్స్ జాబితాలో ఉంది. ఆస్ట్రేలియన్ నేషనల్ యాంటీ డోపింగ్ పాలసీ 2021 కూడా కొకైన్ను ఈ జాబితాలో చేర్చింది. ఇకపై జేమీ కర్మాండ్ వాడా గుర్తించిన అధికారిక ఈవెంట్స్ లేదా గేమ్స్లో పాల్గొన కూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో టోక్యో 2020 ఒలింపిక్స్ గేమ్స్ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇక ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ కూడా దీనిపై స్పందించింది. ఆస్ట్రేలియా ఈక్వెస్ట్రియాన్ అథ్లెట్ జేమీ కర్మాండ్ సస్పెన్షన్ అంశం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. ఇదిలా ఉంటే జేమీ తొలిసారిగా ఒలింపిక్స్లో పాల్గొంటున్నాడు. ఇంతలోనే తాను కొకైన్ తీసుకున్నట్లు డోప్ టెస్టులో తేలడంతో అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.