రియో డీ జనీరో: సాక్షి మాలిక్ను యావత్ భారతావని కొనియాడుతోంది. ఇంతకీ సాక్షి ఏం సాధించిందని అనుకుంటున్నారా? రియో ఒలింపిక్స్లో పతకం కోసం గత 12 రోజులుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్న భారతీయ అభిమానుల్లో సాక్షి మాలిక్ ఆనందం నింపడమే.
రియోలో భారత్కు కాంస్యం: ఎవరీ సాక్షి మాలిక్?
వివరాల్లోకి వెళితే... మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన పోరులో విజయం సాధించిన రియోలో భారత్కు తొలి పతకాన్ని అందించింది. ఒలింపిక్స్లో ఓ మహిళా రెజ్లర్ పతకం సాధించడం ఇదే తొలిసారి.
దీంతో భారత్కు తొలి పతకం తెచ్చిపెట్టిన సాక్షి మాలిక్కు సోషల్ మీడియా నీరాజనాలు పడుతోంది. దేశ ప్రముఖులు, సెలబ్రిటీలు మొదలు సాధారణ నెటిజన్ల వరకు సాక్షి మాలిక్ను ప్రశంసలతో ముంచెత్తున్నారు. ఆమె ప్రతిభకు ముగ్ధులవుతూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.
పన్నెండేళ్ల కష్టానికి ఫలితం: కంటతడి పెట్టిన సాక్షి మాలిక్
హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్కు చెందిన ఈ 23 ఏళ్ల అమ్మాయి దేశంలో మహిళా శక్తిని చాటిందని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అంతేకాదు ఒలింపిక్స్లో భారత ప్రాతినిథ్యమే శుద్ద దండగ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన శోభాడేపై నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.
శోభా డేకు ఇది చెంపదెబ్బ అని, ఆమె చెంప ఛెళ్లుమనిపించి మహిళా శక్తిని సాక్షి చాటిందని, ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. 'దేశం కోసం పతకాలు తేలేనప్పుడు ఒలింపిక్స్కు వెళ్లడం అనవసరం. కేవలం అక్కడ సెల్ఫీలు తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్న భారత క్రీడాకారులు, తమ తమ ప్రదర్శనలపై మాత్రం దృష్టి పెట్టడం లేద'ని రచయిత్రి శోభా డే విమర్శించిన సంగతి తెలిసిందే.