చైనా వేదికగా ముగిసిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో చివరి రోజు కూడా భారత రెజ్లర్లు పతకాలతో సత్తా చాటారు. ఆదివారం జరిగిన పోటీల్లో పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో హర్ప్రీత్ సింగ్ (82 కేజీలు) రజతం.. జ్ఞానేందర్ (60 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. భారత్ మొత్తం 16 పతకాలతో ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో పోరును ముగించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఫైనల్లో హర్ప్రీత్ సింగ్ 0-8తో అబ్దావలి (ఇరాన్) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకున్నాడు. ఆసియా చాంపియన్షిప్లో హర్ప్రీత్కిది వరుసగా నాలుగో పతకం. 2016, 2017, 2018లలో కాంస్య పతకాలు నెగ్గాడు. ఇక కాంస్య పతక పోరులో జ్ఞానేందర్ 9-0తో హువాంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు.
మరోవైపు షూటింగ్ ప్రపంచ కప్లో ఆదివారం భారత్ ఒక్క పతకం కూడా గెలవలేదు. అయినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత్ మూడు స్వర్ణాలు, ఓ రజతం సాధించింది. రెండు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యంతో చైనా రెండో స్థానంలో నిలిచింది.