భారత మహిళల జట్టు సంచనల ప్రదర్శన చేసింది. ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆసియా ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టు సెమీస్కు చేరడం 62 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఓవరాల్గా రెండోసారి. 1960లో ముంబై ఆతిథ్యం ఇచ్చిన ఆసియా ఛాంపియన్షిప్లో భారత అమ్మాయిలు సెమీస్కు చేరారు. ఈ టోర్నీలో కాంస్య పతకం సాధించారు.
పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, గతేడాది రన్నరప్ దక్షిణ కొరియాపై క్వార్టర్ ఫైనల్లో భారత్ అద్భుతంగా పోరాడి సెమీస్కు చేరింది. 3-2తో దక్షిణ కొరియాను ఓడించింది. విజయంలో భారత క్రీడాకారిణి ఐహిక ముఖర్జీ ప్రధాన పాత్ర పోషించింది. 92వ ర్యాంకర్ ఐహిక.. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ షిన్ యుబిన్ను చిత్తుగా ఓడించడం విశేషం. తొలి మ్యాచ్లో యుబిన్పై ఐహిక 11-9, 7-11, 12-10, 7-11, 11-7తో విజయం సాధించింది.

రెండో మ్యాచ్లో జియోన్ జిహీపై మనిక బత్రా గెలిచి భారత్ ఆధిక్యాన్ని 2-0కి చేర్చింది. జిహీపై 12-14, 13-11, 11-5, 5-11, 12-10తో మనిక నెగ్గింది. అయితే మూడు, నాలుగు మ్యాచ్ల్లో భారత్ ఓటమి చవిచూసింది. మూడో మ్యాచ్లో మన తెలుగమ్మాయి ఆకుల శ్రీజ.. యున్యె చేతిలో 6-11, 10-12, 8-11తో ఓడింది. ఇక నాలుగో మ్యాచ్లో మనిక బత్రా 11-13, 4-11, 11-6, 11-7, 10-12తో యుబిన్ చేతిలో ఓటమిపాలైంది.
అయితే నిర్ణయాత్మక చివరి మ్యాచ్లో ఐహిక ముఖర్జీ మరోసారి గొప్ప ప్రదర్శనతో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ప్రపంచ 16వ ర్యాంకర్ జియోన్ జిహీపై 7-11, 11-6, 12-10, 12-10తో గెలిచి భారత్ను 3-2తో సెమీస్కు చేర్చింది.