వైకల్యం శరీరానికే కానీ, ప్రతిభకు కాదు అని నిరూపించింది.. 16 ఏళ్ల శీతల్ దేవి. చేతులు లేకపోయినా కాళ్లతోనే విల్లు ఎక్కుపెట్టి ఒకటి కాదు.. ఏకంగా రెండు బంగారు పతకాలను సాధించిపెట్టింది. దీంతో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి ఆర్మ్ లెస్ ఫిమేల్ ఆర్చర్గా రికార్డులకెక్కింది. ఈ రికార్డ్తో ఇప్పుడు శీతల్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న పారా ఆసియా గేమ్స్లో భారత్ తరపున ఆర్చరీలో పోటీపడిన శీతల్.. మిక్స్డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్తో పాటు మహిళల వ్యక్తిగత విభాగంలో కూడా బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. పారా ఆసియా గేమ్స్లో ఆర్చరీ విభాగంలో భారత్కు బంగారు పతకం రావడమే కాదు.. ఒకే ఎడిషన్లో ఆర్చరీ విభాగంలో 2 బంగారు పతకాలు రావడం కూడా ఇదే తొలిసారి.

మొదట మిక్స్డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్లో మరో పారా అథ్లెట్ రాకేశ్ కుమార్తో కలిసి పాల్గొన్న శీతల్.. చైనాకు చెందిన యుషాన్ లిన్, జిన్లియాంగ్ ఐలను 151-149తో ఓడించి గోల్డ్ మెడల్ పట్టేసింది. ఆ తర్వాత ఇండివిడ్యువల్ కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్స్లో సింగపూర్ కు చెందిన అలీమ్ నూర్ సయాహిదాను 144-142 తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఇది మాత్రమే కాదు విమెన్స్ డబుల్స్ విభాగంలో కూడా సిల్వర్ సాధించింది.
అయితే శీతల్ జన్మించినప్పుడు ఫోకోమెలియా సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో అవయవాలు అభివృద్ధి చెందవు. దీనివల్లే శీతల్కు చేతులు అభివృద్ధి చెందలేదు. దీంతో చిన్నప్పుడు శీతల్ తనకు చేతులు లేవని చాలా బాధపడేది. కానీ తర్వాత్తర్వాత తన అంగవైకల్యాన్ని జయించేలా, దాన్ని మరిపించేలా ఏదైనా సాధించాలనుకుంది. ఆ క్రమంలోనే ఆర్చరీ ఆమెను ఆకర్షించింది. చేతులు లేకపోవడంతో కాళ్లు, పాదాల సాయంతో బో ఎక్కుపెట్టి భుజం, తల సాయంతో యారోను షూట్ చేయడం ప్రాక్టీస్ చేసింది. పట్టుదలగా కృషి చేసి సక్సెస్ సాధించింది. ఇప్పుడు వరుస విజయాలు సాధిస్తూ దేశం పేరు నిలబెడుతోంది.