న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్లో భారత్కు తొలి స్వర్ణం సాధించిన లక్నోకు చెందిన జీతూ రాయ్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షలు నగదు బహుమతిని ప్రకటించింది. ఈ సందర్బంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జీతూ రాయ్కు అభినందనలు తెలిపి, నగదు బహుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
దక్షణి కొరియాలోని ఇంచియాన్లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్లో శనివారం 50 మీటర్ల పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ స్వర్ణం సాధించాడు. వరల్డ్ చాంపియన్షిప్ తర్వాత ఏడాది రెండు స్వర్ణ పతకాలు గెలిచినట్టయింది. ఇటీవలే జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లోనూ జీతూ రాయ్ స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.
జస్పాల్ రాణా తర్వతా ఆసియా గేమ్స్లో స్వర్ణం గెలిచిన రెండో షూటర్గా ఓవరాల్గా నాలుగో షూటర్గా జీతూ నిలిచాడు. 1978లో షాట్ గన్ విభాగంలో రణధీర్ సింగ్, 2010లో రంజన్ సోధీ స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు.
ఇక జీతూ రాయ్ నేపాల్లోని ఓ పేద కుటుంబంలో ఐదుగురు సంతానంలో ఒకడు. జీతూ తండ్రి గూర్ఘా రెజిమెంట్లో పనిచేయగా.. తల్లి వ్యవసాయం చేస్తోంది. భారత్ సైన్యంలో సుబేదారుగా ఉద్యోగం తెచ్చుకున్న జీతూ రాయ్ దశాబ్దం క్రిందట ఇక్కడే స్దిరపడ్డాడు.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్య పతకం సాధించింది. ఆసియా గేమ్స్ లో భారత్కు మరో కాంస్యం లభించింది. 10 మీటర్ల పిస్టల్ షూటింగ్లో భారత్కు పురుషుల టీం కాంస్యం దక్కింది.
స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో దీపిక పల్లికల్ సెమీ ఫైనల్స్కు చేరడంలో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో వరుసగా ముడోసారి సౌరవ్ ఘోషాల్ సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. పాకిస్దాన్కు చెందిన ఇక్బాల్ నాజిర్పై సౌరవ్ ఘోషాల్ 11-6, 9-11, 11-2, 11-9 పాయింట్ల తేడాతో గెలుపొందాడు.