చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పతాకాన్ని ఉన్నతంగా ఎగరేసేందుకు తెలంగాణ బిడ్డ ప్రీతి కొంగర ఉవ్విళ్లూరుతోంది. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె సైలింగ్లో అడుగు పెట్టి ఎన్నో అద్భుతాలు సాధించింది. ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఎంతో మంది మనసులు గెలుచుకుంటోంది.
కేవలం 19 ఏళ్ల కొంగర.. ఆసియా క్రీడల్లో 470 మిక్స్డ్ డింగీ విభాగంలో పోటీ పడుతోంది. 11 ఏళ్ల వయసులో సైలింగ్పై ఇష్టం పెంచుకున్న ఆమె.. 'ది వైసీహెచ్ ఫౌండేషన్'లో చేరి సైలింగ్ పాఠాలు నేర్చుకుంది. అప్పటి నుంచి పాల్గొన్న ప్రతి పోటీలో పతకాలు గెలుస్తూ వచ్చింది. జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్స్, సబ్ జూనియర్, సీనియర్ కేటగిరీల్లో కూడా ఆమె సత్తా చాటింది.

గడిచిన 25 సంవత్సరాల్లో ఆసియా క్రీడల్లో సైలింగ్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి తెలంగాణ బిడ్డ ప్రీతినే కావడం గమనార్హం. అంతేకాదు ఈ పోటీల్లో తలపడుతున్న తొలి తెలుగు మహిళా క్రీడాకారిణి కూడా ప్రీతినే. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని చైనాలోని నింగ్బో హార్బర్కు ఆమె బయలుదేరింది. ఈ క్రమంలో ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
'మా జీవితాల్లోకి ప్రీతి ఒక వెలుగు తీసుకొచ్చింది. ఆసియా క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. తను ఇంత ఉన్నత స్థాయికి ఎదుగుతుందని నేను ఊహించలేదు. తను మెడల్తో తిరిగి రావాలని కోరుకుంటున్నా' అని ప్రీతి తల్లి విజయలక్ష్మి కోరుకున్నారు.
ఆసియా క్రీడలకు భారత్ నుంచి వెళ్తున్న బృందంలో ప్రీతి కూడా ఉందని కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. భారత్ నుంచి మొత్తం 634 మంది క్రీడాకారులు చైనాకు వెళ్తుండగా వారిలో 16 మంది సైలర్లు. వీరిలో ప్రీతి కూడా ఒకరు. నింగ్బోకు వెళ్లేందుకు వీళ్లంతా ముంబై నుంచి బయలుదేరారు. ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ముంబైల్లో ట్రైనింగ్ తీసుకున్నానని, ఈ పోటీల్లో కచ్చితంగా మెడల్ సాధిస్తానని ప్రీతి కాన్ఫిడెంట్గా ఉంది.