
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా 18వ ఆసియా గేమ్స్ ఆసక్తికరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల్లో ఈ ఆసియా గేమ్స్ ముగియనున్నాయి. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో పలు క్రీడా విభాగాల్లో పతకాలు గెలిచిన ఇండోనేషియా క్రీడాకారులు తమ ప్రైజ్ మనీ మొత్తాన్ని భూకంప బాధితులకు అందజేయనున్నట్లు ప్రకటించారు.
అంతేకాదు క్రీడాకారులు తమ జెర్సీలు, రాకెట్లకు వేలం వేసి తద్వారా వచ్చే మొత్తాన్ని వారికి ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో పాటు వారి కోసం పెద్ద మొత్తంలో విరాళాలు కూడా సేకరిస్తామని చెప్పారు. బ్యాడ్మింటన్ పురుషుల విజేత జొనాతన్ క్రిస్టీ ఇప్పటికే తన ప్రైజ్ మనీ $102,000ని భూకంప బాధితులకు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.
ఈ మేరకు ఇండోనేషియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వెబ్సైట్ అధికారికంగా తెలిపింది. కరాటేతో పాటు మరికొన్ని క్రీడల్లో పతకాలు గెలిచిన క్రీడాకారులు ఇప్పటికే తమ విజయాలను భూకంప బాధితులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ఇండోనేషియా ఆటగాళ్ల దాతృత్వాన్ని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆగస్టు మొదటి వారంలో ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లాంబోక్ ద్వీపంలో 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో గాయపడ్డారు. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.