
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్లో కబడ్డీ విభాగంలో భారత్ తిరుగులేని ఆధిపత్యానికి గండిపడింది. 1990 బీజింగ్ వేదికగా మొదలైన ఆసియాడ్ నుంచి గత ఇంచియాన్(2014) వరకు ఏకంగా ఏడు స్వర్ణాలతో చరిత్ర సృష్టించిన భారత్ కబడ్డీ జట్టు తొలి ఓటమిని చవి చూసింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
గత 28 ఏళ్ల ఆసియా గేమ్స్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆసియా గేమ్స్లో భాగంగా సోమవారం జరిగిన గ్రూపు-ఎ లీగ్ మ్యాచ్లో భారత కబడ్డీ జట్టు 23-24 తేడాతో కొరియా చేతిలో ఓడిపోయింది. కొన్నాళ్లుగా అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో భారత్కు దీటైన పోటీనిస్తూ వస్తున్న కొరియా ఆసియా గేమ్స్లో కూడా అద్భుత ప్రదర్శన చేసింది.
భారత జట్టులోని లోపాలను ఎత్తిచూపుతూ అద్భుతంగా పాయింట్లను రాబట్టింది. బంగ్లాదేశ్, శ్రీలంకపై ఘన విజయాలతో దూకుడు మీద కనిపించిన భారత్.. కొరియాతో మ్యాచ్లో ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డ ఈ మ్యాచ్లో ప్రతి పాయింటు ఆసక్తికరంగానే సాగింది.
అదే సమయంలో రెండో అర్ధభాగంలో భారత్ పుంజుకోవడానికి ప్రయత్నించినా కొరియా ఆటగాళ్లు దానిని చాలా సమర్ధవంతంగా అడ్డుకున్నారు. మంగళవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత కబడ్డీ జట్టు థాయ్లాండ్తో తలపడుతుంది.
మరోవైపు మహిళల కబడ్డీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో 33-23 తేడాతో థాయ్లాండ్పై గెలిచి మరింత ముందంజ వేసింది. హ్యాట్రిక్ స్వర్ణాన్ని ఒడిసిపట్టుకోవాలన్న కసితో ఉన్న మన మహిళల జట్టు మంగళవారం శ్రీలంక, ఇండోనేషియాతో తలపడనుంది.