ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్ గా నిలిచిన అనూష్ అగర్వాలా కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనతో పాటు కలిసి ఏడేళ్లు ప్రయాణించిన రేసు గుర్రం 'మన్ని'కి భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు.
ప్రాచీన యుద్ధ విద్యల్లో గుర్రపు స్వారీ ఒకటి. ఆధునిక కాలంలో ఇది క్రీడగా మారిపోయింది. అయితే, ఈ గుర్రపు స్వారీలో రాణించాలంటే అంత సులభం కాదు. చాకచక్యంగా స్పందించే గుణంతో పాటు శారీరక సామర్థ్యం, గుర్రాన్ని మచ్చిక చేసుకునే నైపుణ్యమూ ఉండాలి. దాన్నే ఒడిసిపట్టుకుని 2023లో హాంగ్జౌ (చైనా)లో జరిగిన ఆసియా క్రీడల్లో అనూష్.. 'మన్ని'తోనే కలిసి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈక్వెస్ట్రియన్ (గుర్రపుస్వారీ) ఈవెంట్లో మన్నిపై స్వారీ చేసిన అనూష్ గోల్డ్ మెడల్ ను సాధించాడు. దీంతో మన్ని గోల్డెన్ హార్స్ గా పేరు సంపాదించుకుంది.

అయితే తాజాగా తన ఈక్వైన్ పార్ట్నర్ 'మన్ని'కి రిటైర్మెంట్ ఇవ్వాల్సిన సమయం వచ్చిoదని అన్నాడు అనూష్. ఇకపై ఈ రేసు గుర్రంతో బరిలోకి దిగనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
'మన్నికి రిటైర్మెంట్ దశలోకి ఎంటర్ అయింది. ఇకపై పోటీల్లో పాల్గొనదు. నా తొలి అడుగులన్నీ మన్నితోనే వేశాను. నా తొలి గ్రాండ్ ప్రిక్స్, నా మొదటి అంతర్జాతీయ గ్రాండ్ ప్రిక్స్, నా తొలి అంతర్జాతీయ పోటీల్లో... ఇంకా పెద్ద పెద్ద అంతర్జాతీయ టోర్నీల్లోనూ ఈ రేసు గుర్రమే నేను కన్న కలల్ని సాకారం చేసింది. అన్నింటి కన్నా ముఖ్యంగా ఓ గుర్రం, రైడర్ ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకుంటే ఏం అందంగా, అద్భుతంగా ఉంటుందో మన్ని నాకు నేర్పింది' అని అనూష్ ఎమోషనల్ అయ్యాడు.
'మన్ని ఇక నీ సమయం వచ్చింది. నీ మిగతా జీవితాన్ని రిలాక్స్ తీసుకుంటూ నీకు నచ్చినట్టూ ఆస్వాదించు. నా కంపెనీని ఇన్నేళ్ల పాటు బాగా ఎంజాయ్ చేశావని ఆశిస్తున్నాను. నీకెప్పుడు నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. థ్యాంక్యూ మని. నువ్వు నిజంగా అద్భుతం.' అని అనూష్ రాసుకొచ్చాడు.