

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. బుధవారం జరిగిన ట్రిపుల్ జంప్ పోటీల్లో భారత ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్ స్వర్ణ పతకం అందించాడు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
తాజా స్వర్ణంతో ఆసియా గేమ్స్లో భారత స్వర్ణ పతకాల సంఖ్య 10కు చేరింది. ఈ ఈవెంట్లో 48 ఏళ్లుగా ఊరిస్తున్న పసిడి కలను ఇప్పుడు అర్పిందర్ సింగ్ నిజం చేశాడు. ట్రిపుల్ జంప్ ఫైనల్లో 16.77 మీటర్లు దూకి మొదటి స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన అర్పిందర్ రెండో ప్రయత్నంలో 16.58 మీటర్లు దూకాడు.
ఇక మూడో ప్రయత్నంలో ఏకంగా 16.77తో సంచలన ప్రదర్శన చేశాడు. 1970లో మోహిందర్ సింగ్ 16.11 మీటర్లతో స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత భారత అథ్లెట్ మళ్లీ పసిడి అందుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో మొత్తం 53 పతకాలు ఉన్నాయి. ఇందులో 10 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్యాలు ఉన్నాయి.