హాంగ్జో వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో 17 ఏళ్ల నేహా ఠాకూర్ చరిత్ర సృష్టించింది. అమ్మాయిల డింగీ విభాగంలో పోటీ పడిన ఈ సెయిలర్.. రజతంతో మెరిసింది. ఈ క్రమంలో భారత్ తరఫున ఈ ఆసియా క్రీడల్లో మెడల్ సాధించిన అత్యంత చిన్న వయసు క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. దీంతో ఈ ఏషియన్ గేమ్స్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 12కు చేరుకుంది.
మిగతా క్రీడల్లో పురుషుల 4*100 రిలే స్విమ్మింగ్ బృందం ఫైనల్ చేరుకుంది. శ్రీహరి నటరాజ్, లిఖిత్ సెల్వరాజ్, సాజన్ ప్రకాష్, తనీష్ జార్జ్ మాథ్యూతో కూడిన బృందం 4*100 మెడ్లీ రిలేలో జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. హీట్-1లో కేవలం 3:40.84 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఈ బృందం ఫైనల్కు దూసుకెళ్లింది. ఇంతకుముందు జాతీయ రికార్డు 3:44.94 సెకన్లుగా ఉంది.

అలాగే మహిళల సింగిల్స్ టెన్నిస్లో అంకిత కూడా ముందంజ వేసింది. హాంగ్ కాంగ్ క్రీడాకారిణి ఆదిత్య పాతాళి కరుణరత్నేను ఓడించిన ఆమె క్వార్టర్స్ చేరుకుంది. సింగిల్స్ విభాగం రౌండ్-3 మ్యాచులో 6-1, 6-2 తేడాతో అంకిత విజయం సాధించింది. దీంతో క్వార్టర్ ఫైనల్స్లో అడుగు పెట్టిన అంకిత.. 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో మెరిసింది.
మరో విభాగంలో పురుషుల స్క్వాష్ టీం కూడా చెలరేగింది. సింగపూర్తో జరిగిన మ్యాచులో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచులో జెరోమీ క్లీమెంట్ జింగ్ మింగ్ ఆను 3-1 తేడాతో హరీందర్ పాల్ సింగ్ సంధు ఓడించాడు. శామ్యూల్ షాన్ ము కాంగ్తో జరిగిన మ్యాచులో సౌరవ్ ఘోష్ 3-0 తేడాతో నెగ్గాడు. జియా హుయీ మార్కస్ ఫువాను అభయ్ సింగ్ కూడా 3-0 తేడాతో ఓడించాడు. ఈ టీం తమ తదుపరి మ్యాచులో ఖతర్ను ఎదుర్కొంటుంది.
జూడో ప్లేయర్ తులిక మాన్ కూడా ఈ ఆసియా క్రీడల్లో సత్తా చాటింది. చైనీస్ తైపీ ప్లేయర్ జియా వెన్ సాయ్ను ఓడించిన ఆమె కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. అదే సమయంలో మరో మహిళా టెన్నిస్ ప్లేయర్ రుతుజ భూసాలే తడబడింది. ఫిలిప్పీన్స్ ప్లేయర్ అలెక్స్ ఈలీతో జరిగిన రౌండ్-3 మ్యాచులో 6-7 (5), 2-6 తేడాతో ఓడి ఈ పోటీల నుంచి తప్పుకుంది.