అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్నారంటూ ఆసియా గేమ్స్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందించారు. క్రీడలకు ఏపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా గేమ్స్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శుక్రవారం కలిశారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో క్రీడాకారులు కోనేరు హంపి, బీ అనూష, యర్రాజీ జ్యోతి సీఎంను కలిసి తమ పదకాలు చూపించారు. ఈ క్రమంలోనే సీఎం వారందరినీ అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ ఎండీ హెచ్.ఎం.ధ్యానచంద్ర, శాప్ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.

అలాగే స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాల వివరాలను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దాని ప్రకారం..
1. మైనేని సాకేత్ సాయి, విశాఖపట్నం, టెన్నిస్, ఏషియన్ గేమ్స్ సిల్వర్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
2. వెన్నం జ్యోతి సురేఖ, ఎన్టీఆర్ జిల్లా, ఆర్చరీ, ఏషియన్ గేమ్స్లో 3 గోల్డ్ మెడల్స్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 90 లక్షలు.
3. కిడాంబి శ్రీకాంత్, గుంటూరు, బాడ్మింటన్, ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
4. ఆర్. సాత్విక్ సాయిరాజ్, రాజమహేంద్రవరం, బాడ్మింటన్, ఏషియన్ గేమ్స్లో సిల్వర్, గోల్డ్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 50 లక్షలు.
5. యర్రాజీ జ్యోతి, విశాఖపట్నం, అథ్లెటిక్స్, ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
6. బొమ్మదేవర ధీరజ్, ఆర్చరీ, ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
7. కోనేరు హంపి, ఎన్టీఆర్ జిల్లా, చెస్, ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
8. బి.అనూష, అనంతపూర్, క్రికెట్, ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 30 లక్షలు.
అంతేకాకుండా ఈ నగదు పురస్కారంతో పాటు గతంలో పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు మొత్తం కలిపి రూ. 4. 29 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్లో ఏపీ క్రీడాకారులు 5 గోల్డ్, 6 సిల్వర్లతో మొత్తం 11 పతకాలు సాధించారు.