చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్కు షూటింగ్లో మరో మెడల్ వచ్చింది. పురుషుల వ్యక్తిగత ట్రాప్ ఈవెంట్లో 32 ఏళ్ల షూటర్ కైనన్ చెనాయ్ కాంస్య పతకం సాధించాడు. ఈ ఈవెంట్ ఫైనల్లో 32/40 పాయింట్లు సాధించిన కైనన్ మూడో స్థానంలో నిలిచాడు. దీంతో అతనికి కాంస్య పతకం దక్కింది.
ఇదే ఈవెంట్లో మరో షూటర్ జొరావర్ సింగ్ సంధూ ఐదో స్థానంలో నిలిచాడు. ఫైనల్లో జొరావర్ కేవలం 23/30 స్కోరు మాత్రమే సాధించగలిగాడు. ఇక మరో మ్యాచ్లో భారత స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ జోడీ అద్భుతమైన విజయం సాధించింది. పాకిస్తాన్ జోడీతో జరిగిన మ్యాచును కేవలం 11 నిమిషాల్లోనే భారత జోడీ విజయం సాధించింది.

దీపికా పల్లికల్, హరీందర్ పాల్ సంధూ ఇద్దరూ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. పాక్ జోడీ మెహ్విష్ అలీ, నూర్ జమన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 11 నిమిషాలు మాత్రమే సాగిన ఈ మ్యాచులో పల్లికల్, హరీందర్ పాల్ ఇద్దరూ కూడా 11-4, 11-1 తేడాతో చిత్తుగా ఓడించింది. ఆ తర్వాత కాసేపటికే మరో మ్యాచ్లో కూడా పాక్ను భారత్ ఓడించింది.
స్క్వాష్లోనే జరిగిన మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జరిగిన పూల్-డీ మ్యాచులో భారత్కు చెందిన అనాహత్ సింగ్, అభయ్ సింగ్ చెలరేగారు. పాక్కు చెందిన సదియా గుల్, ఫర్హాన్ జమాన్పై భారత జోడీ 11-3, 11-2 తేడాతో విజయం సాధించింది. దీంతో స్క్వాష్లో భారత్ ఒకేరోజు రెండు సార్లు పాక్ను ఓడించినట్లయింది.
బాక్సింగ్లో 2022 వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్యం గెలిచిన జాస్మిన్ లంబోరియా తడబడింది. 60 కేజీల విభాగంలో పోటీ పడిన ఆమె.. నార్త్ కొరియా బాక్సర్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఆమె ఆసియా గేమ్స్ నుంచి నిష్క్రమించింది. మరో మహిళా బాక్సర్ ప్రవీణ్ ఈ పోటీల్లో రాణించింది.
57 కేజీల విభాగంలో తలపడిన ప్రవీణ్.. క్వార్టర్స్లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ను ఓడించి సెమీఫైనల్స్లో అడుగు పెట్టింది. దీంతో బాక్సింగ్లో భారత్కు మరో మెడల్ ఖాయమైంది.