చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు చెలరేగుతున్నారు. అందరూ ఆశించిన స్థాయి కన్నా మెరుగ్గా రాణించిన ప్లేయర్లు తొలిసారి ఆసియా గేమ్స్లో 100 మెడల్స్ పైగా సాధించిన సంగతి తెలిసింది. 'అబ్ కీ బార్ సౌ పార్' నినాదంతో బరిలో దిగిన భారత ప్లేయర్లు దీన్ని నిజం చేశారు.
ఈ క్రమంలోనే భారత అమ్మాయిల కబడ్డీ బృందం స్వర్ణంతో మెరిసింది. చైనీస్ తైపీతో జరిగిన ఫైనల్ హోరాహోరీగా సాగింది. భారత జట్టుకు చైనా టీం గట్టి పోటీ ఇచ్చింది. అయితే చివరి వరకు పట్టుదల కోల్పోని భారత అమ్మాయిలు 26-25 తేడాతో విజయం సాధించి, స్వర్ణం తమ ఖాతాలో వేసుకున్నారు.

అలాగే భారత ఆర్చర్లు ఓజాస్ డియోటాలే చరిత్ర సృష్టించాడు. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో చెలరేగిన ఓజాస్ ఏకంగా స్వర్ణం సాధించాడు. ఈ విభాగంలో భారత్కు దక్కిన తొలి స్వర్ణం ఇదే కావడం గమనార్హం. ఆసియా గేమ్స్ చరిత్రలో ఇలా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జరగలేదు.
అదే సమయంలో ఇదే పోటీల్లో ఓజాస్తో తలపడిన మరో భారతీయ ఆర్చర్ అభిషేక్ వర్మ.. సిల్వర్తో సరిపెట్టుకున్నాడు. మిగతా దేశాల క్రీడాకారులను మట్టి కరిపిస్తూ వచ్చిన వీళ్లిద్దరూ ఫైనల్ చేరినప్పుడే స్వర్ణం కూడా భారత్కే దక్కుతుందని ఫ్యాన్స్ భావించారు. ఇప్పుడు అదే నిజం అవడంతో వాళ్లు చాలా సంతోషిస్తున్నారు.
ఇక మహిళల ఆర్చరీలో తెలుగు తేజం జ్యోతి సురేఖ చెలరేగింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన సో చే వాన్తో జ్యోతి తలపడింది. ఈ మ్యాచులో పైచేయి సాధించిన జ్యోతి.. ఈ ఆసియా క్రీడల్లో తన మూడో గోల్డ్ మెడల్ ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు ఆమె కాంపౌండ్ టీం ఈవెంట్, మిక్స్డ్ టీం ఈవెంట్లలో కూడా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లోనే పోటీ పడిన మరో భారత ఆర్చర్ అదితి గోపీచంద్.. కాంస్య పతక మ్యాచులో ఇండోనేషియాకు చెందిన రైతీ జిల్లిజాటీపై విజయం సాధించింది. దీంతో కాంస్యం ఆమె సొంతమైంది.