ఆసియా గేమ్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. చైనాలోని హాంగ్ జో వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల మూడు వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్లో భారత్కు రెండు పతకాలు వచ్చాయి. 28 ఏళ్ల అథ్లెట్ పరుల్ చౌదరి ఈ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం అందుకుంది. ఇదే రేసులో మూడో స్థానంలో నిలిచిన మరో భారత క్రీడాకారిణి ప్రీతి.. కాంస్య పతకం తన ఖాతాలో వేసుకుంది.
అయితే మహిళల బాస్కెట్ బాల్ టీంకు అదృష్టం కలిసిరాలేదు. క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్న ఈ టీం 57-96 తేడాతో నార్త్ కొరియా చేతిలో ఓటమిపాలైంది. అంతకుముందు తమ చివరి లీగ్ మ్యాచులో కూడా భారత అమ్మాయిలు ఆశించినట్లు రాణించలేదు. చైనాతో జరిగిన ఈ మ్యాచులో ఏకంగా 111-53 తేడాతో ఓడారు. అయితే మిగతా మ్యాచుల్లో గెలవడంతో టాప్-8లో నిలిచి క్వార్టర్స్ చేరుకున్నారు.

అదే సమయంలో భారత లాంగ్ జంపర్ ఆన్సీ సోజన్ అదరగొట్టింది. తన బెస్ట్ జంప్తో ఆసియాడ్లో సిల్వర్ మెడల్ తన ఖాతాలో వేసుకుంది. తన మూడో ప్రయత్నంలోనే 6.56 మీటర్ల జంప్తో ఆకట్టుకున్న ఆమె.. ఐదో ఛాన్స్లో 6.63 మీటర్ల జంప్తో రెండో స్థానాన్ని సాధించింది. చైనాకు చెందిన షికి షాంగ్ (6.73 మీటర్లు) స్వల్ప ఆధిక్యంతో గోల్డ్ మెడల్ కొట్టేసింది.
అలాగే సోమవారం జరిగిన 4+400 మీటర్ల మిక్స్డ్ రిలే రేసులో కూడా భారత్ మెడల్తో మెరిసింది. మహమ్మద్ అజ్మల్ వరియతోడి, విథ్య రామ్రాజ్, రాజేష్ రమేష్, సుభా వెంకటేశన్తో కూడిన బృందం ఈ రేసును 3:14.34 సెకన్లలో పూర్తి చేసి సిల్వర్ మెడల్ అందుకుంది. ఇదే పోటీలో భారత్ కన్నా కేవలం 0.32 సెకన్ల వేగంగా రేస్ పూర్తి చేసిన బహ్రెయిన్కు గోల్డ్ దక్కింది.

భారత పురుష ఆర్చర్లు అతను దాస్, ధీరజ్ బొమ్మరదేవ ఇద్దరూ రాణించారు. పరుషుల వ్యక్తిగత రీకర్వ్ ఈవెంట్లో పోటీ పడిన అతను (678 పాయింట్లు), ధీరజ్ (675 పాయిట్లు) క్వార్టర్స్ చేరుకున్నారు. కాగా, కురాష్ ప్లేయర్లు యష్ కుమార్ చౌహాన్, జ్యోతి టోకాస్ ఇద్దరూ ఇంటిముఖం పట్టారు. పురుషుల 90 కేజీల విభాగంలో యష్ 10-0 తేడాత, మహిళల 87 కేజీల విభాగంలో జ్యోతి 3-0 తేడాతో ఓడిపోయి ఇంటిదారి పట్టారు.