ఆసియా క్రీడల్లో భారత అమ్మాయిల క్రికెట్ టీం చెలరేగింది. సెమీఫైనల్లో బంగ్లాను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచులో ముందుగా బంగ్లా అమ్మాయిలు బ్యాటింగ్ చేశారు. అయితే భారత స్టార్ ప్లేయర్ పూజా వస్త్రాకర్ బంతితో చెలరేగింది. ఏకంగా నాలుగు వికెట్లు తీసుకుంది. ఆమెకు మిగతా బౌలర్ల నుంచి మంచి సహకారం లభించింది. దీంతో బంగ్లా ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
ఫీల్డింగ్లో కూడా చెలరేగిన భారత జట్టు రెండు రనౌట్లు చేసింది. ఈ క్రమంలో బంగ్లా అమ్మాయిలు కేవలం 51 పరుగులకే ఆలౌట్ అయ్యారు. బంగ్లా చరిత్రలో భారత్పై ఇంత తక్కువ స్కోరు ఎప్పుడూ చేయలేదు. ఇక లక్ష్య ఛేదనలో భారత్ కూడా కొంత తడబడిందనే చెప్పాలి. టీం కెప్టెన్ స్మృతి మంధాన (7), మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (17) ఇద్దరే ఛేజింగ్ పూర్తి చేసేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు.

నిదానంగా జట్టును విజయ తీరాలకు చేర్చే ప్రయత్నంలో వీళ్లిద్దరూ వికెట్లు పారేసుకున్నారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (20 నాటౌట్) ధనాధన్ షాట్లతో విరుచుకుపడింది. ఎడాపెడా బౌండరీలు బాదేసి జట్టుకు విజయాన్ని అందించింది. భారత జట్టు కేవలం 50 బంతుల్లోనే ఛేజ్ను ముగించి ఆసియా క్రీడల్లో ఫైనల్ చేరుకుంది.
ఇక మిగతా క్రీడల్లో భారత రోయింగ్ జోడీ బాబూలాల్ యాదవ్, లేఖ్ రామ్ కాంస్యం సాధించారు. పురుషుల కాక్స్లెస్ పెయిర్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచిన వీళ్లు బ్రోంజ్ మెడల్ తమ ఖాతాలో వేసుకున్నారు. అలాగే పురుషుల ఎయిట్స్ టీం రోయింగ్ ఈవెంట్లో కూడా భారత్ రాణించింది. ఈ పోటీని రెండో స్థానంలో ముగించి సిల్వర్ మెడల్ అందుకుంది.
నీరజ్, నరేష్ కల్వానియా, నితీష్ కుమార్, చరణ్జీత్ సింగ్, జస్వీందర్ సింగ్, భీమ్సింగ్, పునీత్ కుమార్, ఆశిష్తో కూడిన బృందం 5.43 నిమిషాల్లో పోటీని ముగించింది. అయితే చైనా టీం వీరి కన్నా కేవలం 2.84 సెకన్ల ముందు నిలిచి స్వర్ణం సాధించింది. భారత బృందం రజతంతో సరిపెట్టుకుంది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్స్ మహిళల బృందం, పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ జోడీ కూడా సిల్వర్ మెడల్స్ సాధించిన సంగతి తెలిసిందే.