ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. పురుషుల 3 వేల మీటర్ల స్టీపిల్ ఛేజ్లో అవినాష్ సాబ్లే అదరగొట్టాడు. ఈ విభాగంలో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. చైనాలోని హాంగ్జో వేదికగా జరిగిన ఈ రేసును 8:19.53 సెకన్లలో పూర్తి చేసిన అవినాష్ చరిత్ర సృష్టించాడు.
గతంలో 2022 కామన్వెల్త్ క్రీడల్లో కూడా రాణించిన అతను ఆ పోటీల్లో కాంస్యం సాధించాడు. ఇప్పుడు ఆసియా కప్లో స్వర్ణంతో చరిత్ర తిరగరాశాడు. అలాగే తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ కూడా ఆసియాడ్లో రాణించింది. రెండుసార్లు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన ఆమె.. ఈసారి ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది.

50 కేజీల విభాగంలో తలపడిన నిఖత్.. సెమీఫైనల్లో థాయ్ల్యాండ్కు చెందిన రాక్సత్ ఛుటామట్ చేతిలో ఓడింది. దీంతో ఆమె కాంస్యం దక్కించుకుంది. మరో భారత క్రీడాకారుడు తజీందర్పాల్ టూర్ ఆసియా క్రీడల్లో చెలరేగాడు. వరుసగా రెండోసారి షార్ట్ పుట్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ పోటీల్లో 20.36 మీటర్ల త్రో విసిరిన అతను స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు.
గతంలో 2018 ఆసియా క్రీడల్లో కూడా తజీందర్ రాణించాడు. అప్పుడు 20.75 మీటర్ల త్రో విసిరిన అతను గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అదే సమయంలో ప్రతిభకు వయసుతో సంబంధం లేదని వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న నిరూపించాడు. ఆసియాడ్లో మిక్స్డ్ డబుల్స్లో బోపన్న జోడీ పసిడి పతకం సాధించింది.
ఫైనల్ మ్యాచులో చైనాకు చెందిన సుంగ్ హావో, లియాంగ్ ఎన్ను రోహన్ బోపన్న, రుతుజా భోసాలే జోడీ ఓడించింది. అలాగే పాతికేళ్ల భారత రన్నర్ హర్మిలన్ బెయిన్స్ కూడా ఈ క్రీడల్లో సత్తా చాటింది. మహిళల 15 వేల మీటర్ల రేసులో రాణించిన ఆమె 4: 12.74 సెకన్లలో రేసు ముగించింది. అయితే ఆమె కన్నా ఒక్క సెకన్ ముందుగా రేసు ముగించిన బహ్రెయిన్ క్రీడాకారిణికి స్వర్ణం లభించింది.