చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. తాజాగా పురుషుల ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్లు గోల్డ్ మెడల్ సాధించారు. కైనన్ చెనాయ్, జొరావర్ సింగ్, పృథ్వీరాజ్ తొండైమన్తో కూడిన బృందం స్వర్ణ పతకంతో రాణించింది. ఓవరాల్గా 361 పాయింట్లు సాధించిన ఈ బృందం టాప్ ర్యాంకులో నిలిచి గోల్డ్ మెడల్ అందుకుంది.
షూటింగ్లో ఇది భారత్కు దక్కిన ఏడో గోల్డ్ మెడల్ కావడం గమనార్హం. అలాగే మహిళల షూటింగ్లో రాజేశ్వరి కుమారి, మనీషా కీర్, ప్రీతి రజక్ బృందం ఆకట్టుకుంది. రెండో స్థానంలో నిలిచిన ఈ బృందం సిల్వర్ మెడల్తో రాణించింది. వీరిలో మనీషా వ్యక్తిగత విభాగంలో కూడా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించడం గమనార్హం.

అంతేకాదు, తొలిసారి మహిళల గోల్ఫ్లో కూడా భారత్కు పతకం దక్కింది. పాతికేళ్ల అదితి అశోక్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో మహిళల వ్యక్తిగత గోల్ఫ్లో సిల్వర్ మెడల్తో రాణించింది. గోల్ఫ్లో ఈ చరిత్రాత్మక మెడల్ సాధించిన అదితిని క్రీడాభిమానులు మెచ్చుకుంటున్నారు. అన్ని రంగాల్లో భారత అమ్మాయిలు చెలరేగుతున్నారని అంటున్నారు.

మహిళల డబుల్స్ టేబుల్ టెన్నిస్లో కూడా భారత అమ్మాయిలు రాణించారు. సుతీర్థ ముఖర్జీ, ఐతిక ముఖర్జీ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్స్లో వరల్డ్ ఛాంపియన్స్ను ఓడించారు. దీంతో ఈ విభాగంలో భారత్కు పతకం ఖాయమైంది. అలాగే భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందం కూడా బాగా రాణించింది. గోల్డ్ మెడల్ మ్యాచ్కు చేరుకుంది. దీనిలో గెలిస్తే భారత బ్యాడ్మింటన్ జట్టు గోల్డ్ మెడల్ సాధిస్తుంది.

కాగా, శనివారం నాడు జరిగిన క్రీడల్లో దాయాది దేశం పాకిస్తాన్ను మూడింట్లో భారత జట్టు ఓడించంది. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా తెగ సంతోషిస్తున్నారు. ఎప్పటికైనా పాకిస్తాన్కు భారత్ మొగుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.