ఆసియా క్రీడల్లో చైనా అధికారులు చీటింగ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తెలుగు రన్నర్ జ్యోతి యర్రాజీ విషయంలో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. 110 మీటర్ల హర్డిల్స్ రేసులో ఆమె పాల్గొంది. ఈ రేసులో చైనా క్రీడాకారిణి ఫాల్స్ స్టార్ట్ చేసింది. అయితే ఆమెను పెద్దగా పట్టించుకోకుండా జ్యోతిపై చైనీస్ అధికారులు అనర్హత వేటు వేశారు. ఆమె గట్టిగా ప్రశ్నించడంతో వీడియో సమీక్షకు వెళ్లింది.
దానిలో చైనా క్రీడాకారిణిదే తప్పు అని తేలడంతో ఆమెను డిస్క్వాలిఫై చేశారు. దీంతో జ్యోతికి దక్కిన మెడల్ కాంస్యం నుంచి రజతానికి అప్గ్రేడ్ అయింది. ఈ గొడవ గురించి మర్చిపోకముందే మరోసారి ఆసియా కప్లో చైనా చీటింగ్ బయటపడింది. ఈసారి వాళ్ల కన్ను బల్లెం వీరుడు నీరజ్ చోప్రాపై పడింది.

జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన త్రో విసిరాడు. అతను విసిరిన బల్లెం 85 మీటర్ల దూరం వరకు వెళ్లిపోయింది. అయితే సాంకేతిక సమస్య కారణం చూపించిన చైనా అధికారులు.. ఈ త్రో ఎంత దూరం వెళ్లిందో లెక్క వేయలేకపోయామని చెప్పారు. మార్కర్ మిస్ అయిందన్నారు. నీరజ్ను మళ్లీ బల్లెం విసరాలని అన్నారు.
అన్నిసార్లూ ఒకేలా బల్లెం విసరడం అత్యంత గొప్ప అథ్లెట్కు కూడా అసాధ్యమే. దీంతో నీరజ్ ఆ తర్వాత విసిరిన బల్లెం కేవలం 82.38 మీటర్లు మాత్రమే వెళ్లింది. అయితే ఆ తర్వాతి ప్రయత్నాల్లో 84.49 మీటర్లు బల్లెం విసిరిన నీరజ్.. ఈ పోటీల్లో స్వర్ణం సాధించాడు. రెండో స్థానంలో కూడా భారత జావెలిన్ త్రోవర్ కిషోర్ జెనా నిలవడంతో భారత్కు ఈ పోటీల్లో స్వర్ణం, రజతం రెండు పతకాలూ దక్కాయి.
అయితే నీరజ్ మొదటి త్రో ఏకంగా 85 మీటర్లపైగా వెళ్లడం చూసిన ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. ఇలా చైనా చీటింగ్ చేసిందని, లేదంటే అదే నీరజ్ బెస్ట్ త్రో అయ్యేదని అంటున్నారు. ఇంత బహిరంగంగా చైనా ఎలా చీటింగ్ చేస్తుందంటూ నిలదీస్తున్నారు. తమ అధికారాన్ని నిర్వాహకులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ ఆసియా క్రీడల్లో ఇంకెన్ని గొడవలు చూడాల్సి వస్తుందో అంటున్నారు.