
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో తొలి కాంస్యం గెలిచి సైనా నెహ్మాల్ రికార్డు సృష్టిస్తే, సింధు ఫైనల్ చేరి రజత పతకంతో మరో కొత్త చరిత్రను సృష్టించింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
తాజాగా, మంగళవారం భారత టేబుల్ టెన్నిస్ పురుషుల జట్టు కాంస్యం పతకాన్ని గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఆసియా గేమ్స్ చరిత్రలో టేబుల్ టెన్నిస్లో భారత్కు లభించిన తొలి పతకం ఇదే కావడం విశేషం. సెమీస్లో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్లో భారత పురుషుల జట్టు 3-0 తేడాతో ఓడిపోయింది.
దీంతో భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఆర్చరీలో పురుషుల, మహిళల జట్లను ఓడించిన దక్షిణ కొరియా చేతిలోనే, టేబుల్ టెన్నిస్లోనూ భారత్ జట్టు ఓడిపోవడం విశేషం. మంగళవారం జరిగిన మూడు ఈవెంట్లలో దక్షిణ కొరియా ఆటగాళ్లు, భారత క్రీడాకారులను ఓడించడం విశేషం.
కాంస్యం గెలిచిన భారత టీటీ పురుషుల జట్టుపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ ప్రశంసల వర్షం కురిపించారు. "టేబుల్ టెన్నిస్లో భారత్కి తొలి పతకం. అద్భుత ప్రదర్శనతో పతకం గెలిచిన భారత టీటీ జట్టుకు అభినందనలు" అంటూ రాజవర్థన్ సింగ్ రాథోడ్ ట్వీట్ చేశారు.
మరోవైపు ఆసియా గేమ్స్ లో భాగంగా జరిగిన వాలీబాల్ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్ చేతిలో 3-1 తేడాతో ఓడిపోయింది. అలాగే బాక్సింగ్లోనూ భారత్కు నిరాశే ఎదురైంది. 57 కిలోల క్వార్టర్ ఫైనల్స్లో భారత బాక్సర్ సోనియా లాథర్, ఉత్తర కొరియా బాక్సర్ హువా సన్ జో చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైంది.