
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. తాజాగా, స్క్వాష్లో భారత్కు మూడు పతకాలు ఖాయం అయ్యాయి. స్క్వాష్ మహిళల సింగిల్స్లో భారత స్టార్ క్రీడాకారిణులు జోష్న చినప్ప, దీపికా పల్లికల్ సెమీ ఫైనల్ చేరుకున్నారు.
జపాన్ అమ్మాయి మిసాకీ కొబయాషితో జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక 3-0తో విజయం సాధించింది. మరో పోరులో జోష్న 3-1 తేడాతో హాంకాంగ్ క్రీడాకారిణి లింగ్ హో చన్ను ఓడించింది. దీంతో వీరిద్దరూ కనీసం కాంస్యం ఖాయం చేసినట్టైంది. ఇక, పురుషుల సింగిల్స్లో సౌరభ్ ఘోషల్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు.
ఆసియా క్రీడల్లో స్క్వాష్ విభాగంలో భారత్కు ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ఇక, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ నిష్క్రమించాడు. థాయ్లాండ్ ఆటగాడు కంటఫోన్తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో 21-12, 15-21, 21-15 తేడాతో ఓటమి పాలయ్యాడు.
దీంతో ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్లో పురుషుల కథ ముగిసింది. మరోవైపు టెన్నిస్లో భారత క్రీడాకారులు మూడు పతకాలను కొల్లగొట్టారు. టెన్నిస్ పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ జోడీ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం 52 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో 6-3, 6-4తో కజకిస్థాన్కు చెందిన అలెగ్జాండర్ బబ్లిక్, డెనిస్ యెవ్సెయెట్ జోడీపై నెగ్గారు.
భారత్ ఇంతకుముందు ఏషియాడ్లో నాలుగుసార్లు పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకుంది. చివరిసారి సోమ్దేవ్ దేవ్వర్మన్-సనమ్ సింగ్ జోడీ 2010లో స్వర్ణం సాధించింది. ఇక సింగిల్స్లో ప్రజ్ఞేశ్ గుణ్నేశ్వరన్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. సెమీఫైనల్లో అతడు 2-6, 2-6తో ఇస్తోమిన్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడిపోయాడు. ఏషియాడ్ పురుషుల సింగిల్స్లో పతకం సాధించిన ఆరో భారతీయుడిగా ప్రజ్ఞేశ్ నిలిచాడు.