హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. శనివారం పోటీల్లో భాగంగా భారత్ స్క్వాష్ ప్లేయర్లు మూడు కాంస్య పతకాలతో మెరిశారు. తొలుత స్క్వాష్ మహిళల సింగిల్స్లో దీపికా పల్లికల్, జ్యోష్న పొన్నప్ప కాంస్య పతకాలు సాధించారు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
సెమీస్లో భాగంగా మలేసియాకు చెందిన నికోల్ డేవిడ్తో తలపడిన దీపికా పల్లికల్ 0-3తో ఓడగా... అదే సెమీస్లో మలేసియాకు చెందిన సుబ్రమణియమ్ శివసంగరితో తలపడిన జ్యోష్న చిన్నప్ప 1-3తో ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. తాజాగా పురుషుల స్క్వాష్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది.
స్క్వాష్ పురుషుల సింగిల్స్లో భారత్కు చెందిన సౌరవ్ ఘోషల్ కాంస్య పతకం సాధించాడు. సెమీస్లో హాంకాంగ్కు చెందిన మింగ్ చున్ చేతిలో 2-3తేడాతో ఓటమిపాలయ్యాడు. ఒక్క శనివారమే స్క్వాష్లో భారత్ మూడు కాంస్యాలను సాధించడం విశేషం. తాజా పతకంతో ఆసియా గేమ్స్లో భారత పతకాల సంఖ్య 27కు చేరింది.
ప్రస్తుతం భారత ఖాతాలో 6 స్వర్ణ, 5 రజత, 16 కాంస్య పతకాలు ఉన్నాయి.