
హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. నాలుగో రోజు భారత షూటర్ రహీ జీవన్ సర్నోబత్ స్వర్ణంతో మెరిసింది. బుధవారం మహిళల 25మీటర్ల పిస్టల్ పోటీలు జరిగాయి.
ఈ పోటీల్లో కొల్హాపూర్కు చెందిన 27 ఏళ్ల రాహి స్వర్ణోబాత్ స్వర్ణం సాధించింది. ఆసియా గేమ్స్లో షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి మహిళగా రహీ చరిత్ర సృష్టించింది. ఫైనల్లో థాయిలాండ్కు చెందిన నపాస్వాన్ యంగ్పైబూన్ను ఓడించి అగ్రస్థానంలో నిలిచింది.
దీంతో థాయ్ షూటర్ యంగ్పైబూన్ రజతం, , కొరియా అమ్మాయి కిమ్ మిన్జుంగ్ కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ఫైనల్లో రహీ జీవన్, యంగ్పైబూన్ హోరాహోరీగా తలపడ్డారు. ఇద్దరూ చెరో 34 పాయింట్లతో సమానంగా నిలిచారు. స్టేజ్-1లో మూడు రౌండ్లలో రహీ జీవన్ 15 పాయింట్లకు గాను 14 సాధించింది.
స్టేజ్-2లో జరిగిన 7 రౌండ్లలో రహీ జీవన్ 20 పాయింట్లు సాధించి ఆసియా గేమ్స్లో సరికొత్త రికార్డుని నెలకొల్పింది. తొలి షూటాఫ్లోనూ తలో ఐదు గుళ్లు కాల్చగా ఇద్దరూ 4-4తో సమంగా నిలిచారు. రెండో షూటాఫ్లో ఐదు గుళ్లకు రహీ జీవన్ 3 పాయింట్లు కొల్లగొట్టగా ప్రత్యర్థి కేవలం 2 మాత్రమే చేసింది.
దీంతో స్వర్ణం భారత్కు చెందిన రహీ జీవన్ వశమైంది. కాగా, భారత్కు నాలుగో స్వర్ణ పతకం కాగా మొత్తంగా పదకొండో పతకం కావడం విశేషం. ఇప్పటివరకు భారత్ మొత్తం 11 పతకాలు సాధించింది. ఇందులో 4 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.