
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. పోటీల్లో భాగంగా బుధవారం భారత ఖాతాలోకి మరో పతకం వచ్చి చేరింది. మిక్స్డ్ టేబుల్ టెన్నిస్లో మానికా బత్రా, శరత్ కమల్కు చెందిన కాంస్య పతకాన్ని సాధించింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
వరల్డ్ నంబర్ వన్ టీటీ జట్టు చైనా ప్లేయర్స్ చీకున్ వాంగ్, ఇంగ్షా సన్ చేతిలో 4- 1 (11-9, 11-5, 11-13, 11-4, 11-8) తేడాతో భారత్ జోడీ ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. ఏషియాడ్ చరిత్రలో టీటీ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో లభించిన తొలి పతకం ఇదే. ఇంతకు ముందు పురుషుల జట్టు ఏషియాడ్లో తొలిసారిగా కాంస్యం గెలిచింది.
భారత్లో హాకీ ఎలాగ జాతీయ క్రీడనో... చైనాలో టేబుల్ టెన్నిస్ జాతీయ క్రీడ. ప్రతీ టోర్నీలో టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్లో చైనా ఆటగాళ్లే అగ్రస్థానంలో ఉంటారు. అలాంటి టాప్ శ్రేణి జోడితో సెమీస్లో తలబడిన భారత జట్టు గట్టి పోటీనే ఇచ్చింది. మొదటి గేమ్ నువ్వా- నేనా అన్నట్టుగా సాగింది.
అయితే భారత జోడిపై పైచేయి సాధించిన చైనా జోడి 11-9తో మొదటి సెట్ గెలుచుకుంది. ఇక, రెండో సెట్లో మాత్రం పూర్తిగా చైనా జోడి తన ఆధిక్యతను ప్రదర్శించింది. చీకున్, ఇంగ్షా 11-5 తేడాతో రెండో గేమ్ గెలుచుకున్నారు. మూడో గేమ్లో పుంజుకున్న భారత జోడి 11-13 తేడాతో సెట్ గెలుచుకుని చైనాకి గట్టి షాక్ ఇచ్చింది.
హోరాహోరీగా సాగిన మూడో గేమ్లో చైనా జోడి 5 గేమ్ పాయింట్లు కాపాడుకోవడం విశేషం. ఇక, నాలుగో గేమ్లో విజృంభించి ఆడిన చైనీస్ జోడీ 11-4తో సొంతం చేసుకుంది. చివరి గేమ్లో భారత జోడీ సైతం హోరాహోరీగా పోరాడినప్పటికీ 11-8తో జైనా జోడీ విజయం సాధించింది.
అంతకుముందు క్వార్టర్స్లో అతి పటిష్టమైన కొరియాపై భారత్ జోడి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మానికా బత్రా, శరత్ కమల్ జోడి 4-11, 12-10, 6-11, 11-6, 11-8 స్కోర్ తేడాతో సిమ్ హో చుయ్, సాంగ్ జీ అన్ జోడిని ఓడించిన సంగతి తెలిసిందే. తాజా పతకంతో భారత ఖాతాలో పతకాల సంఖ్య 51కి చేరుకుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 9 స్వర్ణం, 19 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.