
హైదరాబాద్: ఇండోనేషియాలో ప్రశాంతంగా జరుగుతున్న ఆసియా గేమ్స్లో శనివారం తొలి వివాదం చోటు చేసుకుంది. పోటీల్లో భాగంగా శుక్రవారం పురుషుల 42 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించారు. జపాన్కు చెందిన హిరోటో, బెహ్రెయిన్కు చెంది ఎలబస్సి నువ్వా నేనా అన్నట్లు పరుగెత్తుతున్నారు.
స్టేడియంలో కూర్చుని పందెం వీక్షించే వారంతా ముందున్న ఎలబస్సిదే స్వర్ణం అనుకున్నారు. కానీ, ఇంతలో అందరూ షాకయ్యే ఘటన చోటు చేసుకుంది. సమీపంలో ఉన్న హిరటో.. ఎలబస్సిని నెట్టేశాడు. దీంతో పట్టు తప్పిన ఎలబస్సి కింద పడిపోకుండా సమన్వయంతో పరుగును కొనసాగించాడు.
కానీ, ఇంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్వర్ణం గెలవాలనుకున్న ఎలబస్సి ఆశలు గల్లంతయ్యాయి. దీంతో హిరటోకు పసిడి సొంతం కాగా.. ఎలబస్సికి రజతంతో సరిపెట్టుకున్నాడు. "అతను తోసేశాడు. లేకపోతే ఈ పోటీలో స్వర్ణం నాదే. ఆ సమయంలో నేను ట్రాక్ మీద పడిపోయినంత పనయింది. కానీ బ్యాలెన్స్ చేసుకున్నాను" అని ఎలబస్సి ఆవేదన వ్యక్తం చేశాడు.
"ముగింపు దశలో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఆశ్చర్యపోయాను. ఏం జరుగుతుందో కూడా నేను అర్థం చేసుకోలేపోయా" అని స్వర్ణం గెలిచిన అనంతరం హిరోటో అన్నాడు. జపాన్ అధికారులేమో అతన్ని అధిగమించే సమయంలో వారి మధ్య గ్యాప్ లేదని, దాంతోనే తమ అథ్లేట్ తాకాడని వాదిస్తున్నారు.
రిఫరీ మాత్రం ఇరుదేశాల అభ్యర్థనలను తోసిపుచ్చారు. బెహ్రెయిన్ కోచ్ మాత్రం జపాన్ అథ్లెట్ ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో తోసేశాడని ఆరోపించాడు. మరోవైపు బెహ్రెయిన్ జట్టు మేనేజ్మెంట్ అధికారులు ఆసియా గేమ్స్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. వీడియోలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.