
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆసియా క్రీడల్లో మరో బంగారు పతకాన్ని దక్కించుకోవాలన్న భారత్కు నిరాశ ఎదురైంది. స్క్వాష్ మహిళల టీమ్ విభాగంలో ఫైనల్ చేరిన భారత్ స్వర్ణం గెలుస్తుందేమోనని అభిమానులు ఆశించారు. అయితే, స్క్వాష్ ఈవెంట్లో భారత మహిళల జట్టు రజత పతకం సాధించింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
శనివారం జరిగిన స్వర్ణ పోరులో జోష్న చిన్నప్ప, దీపికా పల్లికల్, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నాతో కూడిన భారత మహిళల స్క్వాష్ జట్టు హాంకాంగ్కు చెందిన జట్టు చేతిలో 0-2తేడాతో ఓడిపోయింది. తొలి సింగిల్స్లో సునన్య కురువిల్ల ఓటమితో భారత్ 0-1తో వెనుకబడింది. ఆ తర్వాత రెండో సింగిల్స్లో జోష్న చిన్నప్ప కూడా ఓడిపోవడంతో హాంకాంగ్ 2-0తో విజయం సాధించి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.
ఫలితంగా భారత జట్టు రజతంతో సరిపెట్టుకుంది.ప్రస్తుత ఆసియా గేమ్స్లో స్క్వాష్ ఈవెంట్లలో భారత్కు దక్కిన ఐదవ పతకం కావడం విశేషం. అంతకముందు స్క్వాష్ సింగిల్స్ పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్ ఈవెంట్లలతో పాటు పురుషుల టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు వచ్చాయి.
మహిళల సింగిల్స్లో దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప చెరో కాంస్య పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. పురుషుల సింగిల్స్లో సౌరవ్ ఘోషల్ కాంస్యం నెగ్గాడు. పురుషుల టీమ్ ఈవెంట్లో సౌరవ్ ఘోషల్, హరిందర్ పాల్ సంధు, రమిత్ టాండన్, మహేష్ మంగోన్కర్లు సైతం కాంస్యం నెగ్గారు.
తాజా పతకంతో ఈ ఆసియా గేమ్స్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 68కు చేరింది. ఇందులో స్వర్ణాలు 15, రజతాలు 24, కాంస్యాలు 29 ఉన్నాయి. ఆసియా గేమ్స్ చరిత్రలో భారత్ 68 పతకాలు నెగ్గడం ఇదే తొలిసారి. దీనిని బట్టి చూస్తే ఆసియా గేమ్స్లో భారత్కిదే అత్యుత్తమ ప్రదర్శన.