హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా గేమ్స్లో భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. శనివారం భారత్ వరుసగా రెండు స్వర్ణాలు సాధించింది. శనివారం తొలుత పురుషుల బాక్సింగ్లో 49 కేజీల విభాగంలో భారత్ తొలి స్వర్ణం అందుకుంది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
ఆ తర్వాత జరిగిన బ్రిడ్జ్ ఈవెంట్లో భారత్ మరో స్వర్ణాన్ని సాధించింది. పురుషుల పెయిర్ ఫైనల్-2లో ప్రణబ్ బర్దన్-శిబ్నాథ్ సర్కార్ జోడీ పెద్ద సంచలనమే సృష్టించారు. ఈ పోటీలో హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన చైనా జోడి చెన్ గాంగ్, యాన్ లిక్సిన్లను వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించారు.
మిగతా పోటీదారుల కంటే మెరుగైన ప్రదర్శనతో 384 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించారు. ఈ ఈవెంట్లో చైనా జోడి చెన్ గాంగ్, యాన్ లిక్సిన్ 378 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో నిలిచి రజత పతకంతోనే సరిపెట్టుకున్నారు. తాజా స్వర్ణం భారత్కు 15వ స్వర్ణం కావడం విశేషం. తద్వారా ఆసియా గేమ్స్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది.
అంతగా ప్రాచుర్యం లేని క్రీడాభిమానులకు అసలే మాత్రం పరిచయం లేని బ్రిడ్జ్ ఈవెంట్స్లో భారత్కు ఈ ఆసియా గేమ్స్లో మూడు పతకాలు సాధించింది. రెండు కాంస్య పతకాలతో పాటు, ఒక్క స్వర్ణ పతకం బ్రిడ్జ్ ఈవెంట్ నుంచి భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల టీమ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లతో భారత జట్లు కాంస్య పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే.
గతంలో ఎన్నడూ సాధించని స్థాయిలో భారత్ పతకాలు సాధించింది. 1951లో మాత్రమే భారత్ 15 స్వర్ణాలు సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ రికార్డును సమం చేసింది. మరోవైపు ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 67కు చేరింది. ఇందులో స్వర్ణాలు 15, రజతాలు 23, కాంస్యాలు 29 ఉన్నాయి.
ఫలితంగా ఆసియా గేమ్స్ చరిత్రలో భారత్ 67 పతకాలు నెగ్గడం ఇదే తొలిసారి. దీనిని బట్టి చూస్తే ఆసియా గేమ్స్లో భారత్కిదే అత్యుత్తమ ప్రదర్శన.