
జకార్తా: కడుపున పుట్టిన సంతానం గొప్పవాళ్లవుతుంటే చూసి తరించాలని ఏ తల్లీదండ్రి అనుకోరు. ఇలానే కొద్ది నిమిషాల్లో ఆసియా క్రీడల్లో తమ కుమార్తె ఫైనల్ పరుగును కళ్లారా చూడాలనుకున్నారు ఆమె కుటుంబసభ్యులు, గ్రామస్థులు. ఇందుకోసం ఆ గ్రామస్థులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఒకవేళ పోటీ జరిగే సమయంలో కరెంటు పోతే ఎలా అని ఆలోచించిన వారు జనరేటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.
కానీ, ఆమె పరుగును చూడలేకపోయారు. ఎందుకంటే, ఇండోనేషియా వేదికగా 18వ ఆసియా క్రీడలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. పోటీల్లో భాగంగా ఆదివారం మహిళల 400మీటర్ల పరుగు పందెం ఫైనల్ జరిగింది. భారత్ తరఫున హిమ దాస్ బరిలోకి దిగింది. అసోంలోని కందులిమర గ్రామంలో ఉంటున్న హిమ కుటుంబసభ్యులు ఫైనల్ పోరును వీక్షించాలనుకున్నారు. ఇందుకోసం గ్రామస్థులతో ఆ ఊరిలో భారీ తెరతో పాటు జనరేటర్ కూడా సిద్ధంగా ఉంచుకున్నారు.
ఇంకా పోటీ ప్రారంభమయ్యేందుకు కొద్ది నిమిషాలు మిగిలి ఉన్న సమయంలో గ్రామస్థులంతా సిద్ధమైయ్యారు.. ఇంతలో వారు ఊహించినట్టే కరెంటు పోయింది. వెంటనే జనరేటర్ ఆన్ చేసుకుని టీవీ ఆన్ అయ్యే సమయానికి వారంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన హిమ దాస్ పరుగు పూర్తయింది. దీంతో వారంతా మొదట ఎంతో నిరాశ చెందారు. కానీ, హిమ రజతం గెలిచినందుకు తర్వాత సంబరాలు చేసుకున్నారు.
గత నెలలో ఐఏఏఎఫ్ అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగే రోజు కూడా ఇలాగే కరెంటు పోవడంతో హిమ పరుగును ఆమె తల్లిదండ్రులు చూడలేకపోయారు. అప్పుడు ఆ పోటీల్లో హిమ బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా హిమ తండ్రి రంజిత్ మాట్లాడుతూ... 'మా గ్రామంలో కరెంటు కోత సమస్య ఎప్పుడూ ఉండేదే. రోజులో చాలా గంటలు మేము కరెంటు లేకుండానే గడుపుతాం. దీని గురించి మేము పట్టించుకోం. మాకు ముఖ్యమైనదల్లా ఒకటే. మా కుమార్తె రోజు రోజుకి మెరుగవ్వాలి. మరిన్ని పతకాలు గెలవాలి' అని దాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు.