హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు లాంఛనంగా మొదలయ్యే దానికంటే ముందే మొదలుపెట్టడంతో భారత క్రీడాకారులకు పెను సమస్య ఎదురైంది. భారత క్రీడాకారులకు సరైన సమయానికి కిట్లు అందకపోవడంతో ఆటగాళ్లు సాధారణంగానే బరిలోకి దిగారు. ఆసియా క్రీడలు ఇంకా నాలుగు రోజులు సమయం ఉన్నప్పటికీ కొన్ని పోటీల్ని ఇప్పటికే మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో.. సోమవారం భారత హ్యాండ్ బాల్ జట్టు టోర్నీలో తన పోరాటాన్ని మొదలుపెట్టేసింది ఫలితంగా ఓడిపోయింది.
చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్లో భారత్ 28-38 తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉండగా.. ఇలాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడే సమయంలో ఆటగాళ్లంతా ఒకే రంగు దుస్తులు ధరించడం ఆనవాయితీ. కానీ, భారత ఆటగాళ్లు అలా కనిపించలేదు. దీంతో ఆటగాళ్లందరూ వేర్వేరు షర్టుల్లో దర్శనమిచ్చారు. 'ఆసియా క్రీడల్లో పాల్గొనే కొందరు క్రీడాకారులకు కిట్లు అందించలేం. వారి కిట్లు వారే స్వతహాగా కొనుక్కోవాలి' అని ఐఓఏ తెలిపింది.
ఈ విషయం తెలుసుకున్న కేంద్ర క్రీడల మంత్రి 'అలాంటిదేమీ లేదు. ఆసియా క్రీడల్లో పాల్గొనే వారందరికీ కిట్లు పంపిణీ చేస్తాం' అని హామీ ఇచ్చారు. దీంతో ఆటగాళ్లు కిట్లు కొనుక్కోలేదు. సరైన సమయానికి జట్టు మేనేజ్మెంట్ సభ్యులు ఆటగాళ్లకు కిట్లు అందజేయడంలో విఫలమయ్యారు. దీంతో సోమవారం చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు వేర్వేరు చొక్కాలు ధరించి ఆడారు. ఇది చూసి అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆగస్టు 18న ఆసియా క్రీడలు లాంఛనంగా ప్రారంభంకానున్నాయి.
ఇందుకోసం ఇప్పటికే భారత బృందం జకార్తా చేరుకుంది. ఆసియా క్రీడల కోసం జరిగిన సమావేశంలో ఒలింపిక్ సంఘం క్రీడాకారులందరికీ యూనిఫాంలు, కిట్లు అందజేయాలేమంటూ ప్రకటించింది. ఏటా ఇస్తున్నా ఈ ఏడాది అందజేసేందుకు సిద్ధంగా లేదని తెలియజేయడంతో ఆ బాధ్యతను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకుంది. 755 మంది క్రీడాకారులకు కిట్లు ఇవ్వగలమని.. మిగిలిన 49 మందికి అందజేయలేమని చెప్పేసింది. ఈ హామీతోనూ క్రీడాకారులు లబ్ది పొందలేకపోయారు. సోమవారం జరిగిన హ్యాండ్బాల్ గేమ్లో యూనిఫాంలు లేకుండానే బరిలోకి దిగాల్సి వచ్చింది.