
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. షూటింగ్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. శుక్రవారం జరిగిన 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ క్రీడాకారిణి హీనా సిద్ధూ కాంస్యం సాధించింది.
ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన హీనా సిద్ధు మిగతా షూటింగ్ ఈవెంట్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా... 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ షూటింగ్ క్వాలిఫైయింగ్ రౌండ్లో రికార్డు స్థాయిలో పాయింట్లు నమోదు చేసిన హీనా సిద్ధు ఫైనల్ రౌండ్లోనూ స్వర్ణ పతకం కోసం పోరాడింది.
స్వర్ణ పతకం కోసం చైనీస్ షూటర్ వాంగ్ కియాన్, హీనా సిద్ధుల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. కానీ ఆఖరి ట్రయల్స్లో మాత్రం చైనీస్ షూటర్ వాంగ్ కియాన్, కొరియన్ షూటర్ మింజుంగ్ ఆధిపత్యం ప్రదర్శించడంతో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో 219.2 పాయింట్లతో హీనా సిద్ధు కాంస్యం పతకానికే పరిమితమైంది.
240.3 పాయింట్లతో చైనీస్ షూటర్ వాంగ్ కియాన్ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా.. 237.6 పాయింట్లతో కొరియన్ షూటర్ మింజుంగ్ రెండో స్థానంలో నిలిచి రజతం నెగ్గింది. మరోవైపు, ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో 16 ఏళ్ల భారత షూటర్ మను భాకర్ చిన్నపాటి తప్పిదం కారణంగా ఎలిమినేట్ అయింది.
దీంతో 176.2 పాయింట్లతో 5వ స్థానానికే పరిమితమైంది. ఆసియా గేమ్స్లో హీనా సిద్ధూకు ఇది మొత్తంగా 3వ పతకం. 2010 గ్వాంగ్జూ ఆసియా గేమ్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో రజతం, 2014 ఇంచియాన్ గేమ్స్లో 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకం నెగ్గింది.
ఇక, ప్రస్తుత ఆసియా గేమ్స్ షూటింగ్లో భారత్కు ఇది 3వ కాంస్య పతకం కావడం విశేషం. హీనా కంటే ముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రవికుమార్,అపూర్వి చండేలా, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో అభిషేక్ వర్మ కాంస్యాలు సాధించారు.
హీనా సిద్ధు కాంస్య పతకంతో షూటింగ్ వివిధ విభాగాల్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య తొమ్మిదికి చేరింది. తాజా పతకంతో ఆసియా గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 23కు చేరింది. దీంతో ఈ పోటీల్లో మన భాకర్ ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత ఖాతాలో 5 స్వర్ణ, 4 రజత, 14 కాంస్య పతకాలు ఉన్నాయి.