
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నగదు ప్రోత్సాహకాలతో ఘనంగా సన్మానించింది. వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణం సాధించిన ప్లేయర్లకు ఒక్కొక్కరికి రూ. 30 లక్షలు, రజతానికి రూ. 20 లక్షలు, కాంస్యానికి రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని అందజేసింది.
గత ఆదివారంతో ముగిసిన ఆసియా గేమ్స్లో భారత క్రీడా బృందం రికార్డు స్థాయిలో 69 పతకాలు సాధించింది. అందులో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలు ఉన్నాయి. అట్టహాసంగా జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ మాట్లాడుతూ క్రీడారంగ అభివృద్ధికి రాథోడ్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
ప్రపంచంలో అతిపెద్ద క్రీడాశక్తిగా ఎదగడానికి భారత్ మరెంతో దూరంలో లేదని ఆయన అన్నారు. "మన అథ్లెట్ల ప్రదర్శన చూసి మంత్రముగ్దుడినయ్యా. అతి తక్కువ సమయంలోనే భారత్ ఆర్థిక శక్తిగానే కాకుండా క్రీడాశక్తిగా కూడా ఎదుగుతుందనే నమ్మకం నాకుంది. పతకాలు సాధించిన విజేతలందరికీ అభినందనలు" అని రాజ్నాథ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాథోడ్సహా కేంద్ర మంత్రులు కిరణ్ రిజుజు, మహేష్ శర్మ, క్రీడాశాఖ కార్యదర్శి రాహుల్ భట్నాగర్, ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా, శాయ్ డీజీ నీలమ్ కౌర్ పాల్గొన్నారు.