

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత మహిళా అథ్లెట్ ద్యుతీ చంద్ మరోసారి సత్తా చాటింది. ఇప్పటికే మహిళల వంద మీటర్ల ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించిన ద్యుతి చంద్, 200 మీటర్ల ఈవెంట్లోనూ రజత పతకం కైవసం చేసుకుంది. తద్వారా ఆసియా క్రీడల్లో ఒకటి కన్నా ఎక్కువ పతకాలు సాధించిన పీటీ ఉష, జ్యోతిర్మయి దిగ్గజ అథ్లెట్ల సరసన నిలిచింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
బుధవారం జరిగిన 200మీటర్ల పరుగు పందెంలో ద్యుతీ చంద్ లక్ష్యాన్ని కేవలం 23.20 సెకన్లలో చేరుకున్నది. మొదటి స్థానంలో నిలిచిన బ్రెహయిన్ క్రీడాకారిణి ఒడియాంగ్ ఎడిడియాంగ్ కంటే 0.24 సెకన్లు మాత్రమే వెనకబడి స్వర్ణాన్ని తృటిలో చేజార్చుకుంది. మొదటి 100 మీటర్ల పరుగు వరకూ ద్యుతీ చంద్ మొదటి స్థానంలోనే ఉండటం విశేషం.

అయితే రేసు చివర్లో ద్యుతీని వెనక్కి నెట్టి 22.96 సెకన్లలో లక్ష్యాన్ని చేధించిన ఒడియాంగ్ ఎడిడియాంగ్ స్వర్ణం పతకాన్ని సొంతం చేసుకుంది. 22 ఏళ్ల ద్యుతీ చంద్కు ఇదే మొట్టమొదటి ఆసియా గేమ్స్ కావడం ఓ విశేషమైతే, గత 20 ఏళ్లలో భారత తరుపున ఎవ్వరూ ఈ విభాగంలో పతకం సాధించకపోవడం మరో రికార్డు.
తమ రాష్ట్రం నుంచి ఆసియా గేమ్స్కు వెళ్లి దేశం గర్వించేలా చేసిన ద్యుతీ చంద్కు ఒడిస్సా ముఖ్యమంత్రి కోటిన్నర రూపాయల భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒడిస్సాలోని గోపాల్పూర్లో జన్మించిన ద్యుతీ చంద్పై లింగమార్పిడి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
టెస్టోస్టిరాన్ స్థాయి ఎక్కువగా ఉన్న కారణంగా ఆమె "ఆడది కాదు మగాడు" అంటూ ఇంటర్నేషనల్ అథ్లెట్ అసోషియేషన్ ఆఫ్ ఫెడరేషన్ ద్యుతిపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల కారణంగా 2014లో ఇంచియాన్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో ద్యుతీ చంద్ పాల్గొనలేకపోయింది.
తనపై విధించిన నిషేధంపై ద్యుతీ చంద్ న్యాయ పోరాటం చేసింది. కోర్టుకెళ్లి వివాదాన్ని సైతం పరిష్కరించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా గేమ్స్లో తొలిసారి పాల్గొన్న ద్యుతీ చంద్ ఏకంగా రెండు రజతాలు సాధించి ద్యుతీ దిగ్గజాల సరసన చేరింది. 1986లో సియోల్లో జరిగిన ఆసియా గేమ్స్లో పీటీ ఉష 200 మీటర్లు, 400 మీటర్లు, 400 మీటర్ల హర్డిల్స్, 4×400 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచి రికార్డు సృష్టించింది.
1998 బ్యాంకాక్ క్రీడల్లో జ్యోతిర్మయి సిక్దార్ 800 మీటర్లు, 1500 మీటర్లలో రెండు పతకాలు సాధించింది. 2002 బుసాన్ క్రీడల్లో సునితా రాణి 1500 మీటర్లు, 500 మీటర్లలో రెండు పతకాలతో మెరిసింది. ఇప్పుడు వారి సరసర ద్యుతీ చంద్ చేరింది. దీంతో ద్యుతీ చంద్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.