
హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. తాజాగా షూటింగ్లో మరో సిల్వర్ మెడల్ భారత్ సొంతమైంది. షూటింగ్లో పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో 15 ఏళ్ల శార్ధూల్ విహాన్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఫైనల్లో కొరియాకు చెందిన షిన్ హుయన్వూతో స్వర్ణం కోసం హోరాహోరీ తలపడినా శార్ధూల్ విహాన్.. ఒక్క హిట్ తేడాతో విహాన్ సిల్వర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. షిన్ 74 హిట్స్తో గోల్డ్ మెడల్ గెలవగా.. విహాన్ 73 హిట్స్తో రెండోస్థానంలో నిలిచాడు. 37 పాయింట్ల వరకు అగ్రస్థానంలో ఉన్న శార్ధూల్ విహాన్ ఆ తర్వాత వెనుకబడిపోయాడు.
తాజా పతకంలో ఆసియా గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 17కు చేరింది. గురువారం ఇప్పటివరకు భారత్ రెండు పతకాలను సాధించింది. ఉదయం మహిళల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి అంకిత రైనా సెమీస్లో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సెమీఫైనల్లో చైనాకు చెందిన షుయి జాంగ్ 6-4, 7-6 తేడాలో అంకితపై విజయం సాధించింది.
మరోవైపు టెన్నిస్ పురుషుల డబుల్స్ ఫైనల్ చేరింది రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ జోడీ. దీంతో కనీసం మరో రజత పతకం అయినా భారత్ ఖాతాలో చేరనుంది. ప్రస్తుతం భారత ఖాతాలో మొత్తం 4 స్వర్ణాలు, 4 రజతాలు, 9కాంస్యాలు ఉన్నాయి.