
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా, మంగళవారం భారత్ ఖాతాలోకి మరో పతకం వచ్చింది. పోటీల్లో భాగంగా కాంపౌండ్ ఈవెంట్లో భారత మహిళల ఆర్చరీ జట్టు రజత పతకం సాధించింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
చివరి షాట్ దాకా పోరాడిన జ్యోతి సురేఖ బృందం, తృటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. 231- 228 పాయింట్ల తేడాతో ఓటమి పాలైన ఆర్చరీ జట్టు, రజత పతకంతో సరిపెట్టుకుంది. గోల్డ్ మెడల్ కోసం దక్షిణ కొరియాతో జరిగిన టీమ్ ఈవెంట్లో మొదటి సెట్లో భారత్ దూకుడుగా ఆడింది.
తొలి సెట్ను భారత్ 59-57 స్కోర్తో చేజిక్కించుకున్నది. అయితే రెండో సెట్లో అన్యూహ్యంగా పుంజుకున్న కొరియన్ టీం 58 పాయింట్లు సాధించారు. ఈ రౌండ్లో భారత మహిళలు 56 పాయింట్లకే పరిమితమయ్యారు. దాంతో ఇరు జట్ల స్కోరు సమం అయ్యాయి. మూడో సెట్లో ఇరు జట్లు 58, 58 పాయింట్లు సాధించడంతో రసవత్తరమైన పోటీ నెలకొంది.
నిర్ణయాత్మకమైన చివరి సెట్లో దక్షిణ కొరియా టీం 58 పాయింట్లు సాధించారు. దాంతో ఒత్తిడికి గురైన భారత మహిళలు 55 పాయింట్లకే పరిమితమై రెండో స్థానంలో నిలిచారు. తాజా పతకంతో ఆసియా గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 42కు చేరింది. భారత్ ఖాతాలో 8 స్వర్ణాలు, 14 రజతాలు, 20 కాంస్య పతకాలు ఉన్నాయి.
కేంద్ర మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్, మహిళా ఆర్చరీ జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశారు. 'ఆన్ టార్గెట్. మన ఆర్చరీ మహిళా జట్టు సిల్వర్ గెలిచారు. చురుకైన ఫోకస్, మెరుగైన టెక్నిక్, అమితమైన ఆకాంక్షతో విజయం సాధించారు. గ్రేట్ జాబ్' అంటూ రాజవర్థన్ సింగ్ రాథోడ్ పోస్ట్ చేశారు.