
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్ ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్లో భారత పురుషుల టీమ్ కూడా రజత పతకంతోనే సరిపెట్టుకుంది. దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్లో హోరాహోరీగా తలపడినప్పటికీ భారత పురుషుల జట్టుకు ఓటమి తప్పలేదు.
24 షాట్స్ తర్వాత రెండు జట్లు 229 పాయింట్ల దగ్గర సమమయ్యాయి. దీంతో షూట్ ఆఫ్ నిర్వహించారు. అందులోనూ రెండు జట్లు సమంగా స్కోరు సాధించాయి. అయితే భారత జట్టుతో పోలిస్తే దక్షిణ కొరియా జట్టు ఎక్కువ కచ్చితమైన షాట్లు ఆడటంతో ఆ జట్టుని విజేతగా ప్రకటించారు.
దీంతో, భారత్ ఖాతాలోకి మరో పతకం వచ్చింది. భారత పురుషుల జట్టులో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలు ఉన్నారు. ఇంతకుముందు మంగళవారం జరిగిన మహిళల జట్టు కూడా ఇదే ఈవెంట్లో రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్, పురుషుల ఆర్చరీ జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశారు.
తాజా పతకంతో ఆసియా గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 43కు చేరింది. భారత్ ఖాతాలో 8 స్వర్ణాలు, 15 రజతాలు, 20 కాంస్య పతకాలు ఉన్నాయి.